కేసు పెట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇడి నివేదిక
తిరువనంతపురం : కేరళం అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయన కుమార్తె టి.వీణా, మాజీ మంత్రి, వీణా భర్త పి.ఎ.మహ్మద్ రియాజ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలు కొనసాగుతున్నాయి. సిఎంఆర్ఎల్ - ఎగ్జాలాజిక్ ముడుపుల కేసు పేరుతో గత కొన్నేళ్లుగా అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నించిన బిజెపి, కాంగ్రెస్లు... ఇప్పుడు కక్షసాధింపునకు సిద్ధమవుతున్నాయి. ఈ అంశంపై అవినీతి కేసు నమోదు చేయాలని పేర్కొంటూ మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ)లోని సెక్షన్ 66(2) కింద 25 పేజీల నివేదికను రాష్ట్ర పోలీసు చీఫ్ (ఎస్పిసి) ఎ.చంద్రశేఖర్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) పంపింది. ఇడి నుండి లేఖ అందిందని, అందులోని సమాచారాన్ని పరిశీలించి, చట్టపరంగా తీసుకోవాల్సిన కార్యాచరణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని హోం మంత్రి రమేష్ చెన్నితాల మీడియాకు తెలిపారు.
రాజకీయ కక్షసాధింపు : సిపిఎం కేరళం రాష్ట్ర కార్యదర్శి గోవిందన్ మాస్టర్
ఇడి ఇచ్చిన నివేదిక చట్ట విరుద్ధంగా ఉందని, రాజకీయంగా ప్రేరేపించబడిందని సిపిఎం కేరళం రాష్ట్ర కార్యదర్శి గోవిందన్ మాస్టర్ విమర్శించారు. కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించుకుని కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం పాల్పడే అక్రమ కార్యకలాపాలను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తమిళనాడు, పంజాబ్లో ఇడి ఇలాంటి ప్రతిపాదనలు పంపించినా ఆ రెండు ప్రభుత్వాలు ఇడి వాదనలను తిరస్కరించిన విషయాన్ని గుర్తు చేశారు.








కామెంట్లు (0)