ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం సాగించిన అణచివేత ప్రయత్నాలను ఓడించి విద్యార్థుల ఆందోళనలు విజయవంతమయ్యాయి. ధర్మేంద్ర ప్రధాన్ను విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసేలా ఒత్తిడి చేశాయి. నిరసనను పట్టించుకోకపోవడం, విద్యార్థులపై దారుణంగా దాడులు, ఇంటర్నెట్ను నిరోధించడం, ఆహార పంపిణీని నిలిపివేయడంతో కేంద్ర ప్రభుత్వం నిరసనకారులను వేధించింది. అయితే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయబోమని విద్యార్థి, యువ నిరసనకారులు ప్రకటించడంతో, ప్రభుత్వ క్రూరమైన చర్యలన్నీ విఫలమయ్యాయి.
నీట్ ప్రశ్నపత్రం లీక్ తరువాత జరిగిన నిరసనల్లో భాగంగా దేశవ్యాప్తంగా 700 మందికి పైగా ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను అరెస్టు చేశారు. ఎస్ఎఫ్ఐ కార్యకర్తలపై కూడా దారుణంగా దాడి జరిగింది. సోషల్ మీడియాలో సిజెపికి లభించిన భారీ మద్దతు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. సిజెపి ఎక్స్ అకౌంట్, వెబ్సైట్ను నిషేధించారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా కోరుతూ నిరంతరం నిరసనలు చేసినందుకు ఎస్ఎఫ్ఐ ఢిల్లీ ఇన్స్టాగ్రామ్ ఖాతాను కూడా నిషేధించారు.
జూన్ 6న, సిజెపి, వామపక్ష విద్యార్థి సంఘాలు జంతర్ మంతర్ వద్ద మొదటిసారిగా నిరసన తెలిపినప్పుడు, కేంద్ర ప్రభుత్వం, గోదీ మీడియా ఆ సమ్మెను పూర్తిగా విస్మరించాయి. ఈ నిరసనలు దేశంలోని ప్రధాన నగరాలకు వ్యాపించినప్పటికీ, కేంద్రం తన పట్టును వదల్లేదు. జూన్ 20న సిజెపి, ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎఫ్, ఎఐఎస్ఎ, కెవైఎస్ వంటి సంఘాలు జంతర్ మంతర్ వద్ద నిరవధిక ఆందోళన ప్రారంభించినప్పుడు, ఢిల్లీ పోలీసులు తమ అసలు స్వరూపాన్ని చూపించడం మొదలుపెట్టారు. నిరవధిక ఆందోళనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. రాత్రి అవ్వగానే, జంతర్ మంతర్కు విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. ఆ ప్రదేశానికి తాగునీటి సరఫరాను కూడా పోలీసులు నిలిపివేశారు. విద్యార్థులను బెదిరించి జంతర్ మంతర్కు వెళ్లకుండా నిరుత్సాహపరిచేందుకు కూడా ప్రయత్నించారు.
నిరసన తీవ్రతరం అవుతున్న కొద్దీ, అణచివేత ప్రయత్నాలు కూడా మరింత తీవ్రమయ్యాయి. నిరసనకారులను, అమ్మాయిలతో సహా, అనుమతి లేకుండా ఫోటోలు తీయడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు. నిరసన ప్రదేశంలో నిఘాను కట్టుదిట్టం చేశారు. నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్చుక్ను జంతర్ మంతర్ నుండి బలవంతంగా తొలగించారు. పోలీసులు వాంగ్చుక్ను గుడ్డతో కప్పి నిరసన స్థలం నుండి తొలగించారు. వాంగ్చుక్ను తొలగించకుండా అడ్డుకున్న కార్యకర్తలను పోలీసులు దారుణంగా కొట్టారు. ఈ సమయంలో, అభిజీత్ దీప్కేను కూడా పోలీసులు ముందు జాగ్రత్తగా అదుపులోకి తీసుకుని కొట్టారు.
పార్లమెంట్ మార్చ్లో లక్షలాది మంది ప్రజలు కదంతొక్కడంతో, పోలీసులు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారు. యూనిఫాంలు, నేమ్ బోర్డులు, ఫేస్ మాస్క్లు లేకుండా పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. వందలాది మంది గాయపడ్డారు. ఒక్క తలకే దాదాపు యాభై మందికి గాయాలు అయ్యాయి. పార్లమెంట్ మార్చ్లో పాల్గొన్న చాలా మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు వెనుకాడలేదు. చికిత్స పొందుతున్న వారి వివరాలను వెల్లడించలేదు.
సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ను నిలిపివేయాలని కూడా పోలీసులు నిర్ణయించారు. ఆందోళన వద్దకు విద్యార్థులు, యువత చేరుకోకూడదని పదహారు మెట్రో స్టేషన్లను దిగ్బంధించారు. నిరసనల నుండి తిరిగి వస్తున్న వారిని అరెస్టు చేశారు. నిరసనల్లో పాల్గొనడానికి వస్తున్న వారిని ఢిల్లీ సరిహద్దుల వద్ద అడ్డుకున్నారు. పోలీసులతో పాటు సంఘ్ పరివార్ గూండాలు కూడా విద్యార్థులను కొట్టారు. చాలా మంది జంతర్ మంతర్కు ఆహారాన్ని ఆర్డర్ చేస్తున్నారు. దీనిని నివారించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అన్ని రెస్టారెంట్లను, హోటల్స్ను మూసివేసింది. అంతేకాకుండా నిరసనకారులకు ఏం దొరకుండా చిన్న దుకాణాలతో సహా పెద్ద దుకాణాలను కూడా మూసివేయించింది. నిరసనకారులను అదుపులోకి తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ భద్రతా చట్టం కింద ఢిల్లీ పోలీసులకు అధికారాలు ఇచ్చింది. అయితే, విద్యార్థుల పోరాట స్ఫూర్తి ముందు ఈ ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి.








కామెంట్లు (0)