- వ్యూహాత్మక బంధం బలోపేతం
- ఆస్ట్రేలియా ఎకనామిక్ రోడ్మ్యాప్ బిజినెస్ లో ప్రధాని మోడీ
మెల్బోర్న్: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు,సరఫరా గొలుసు అంతరాయాలు, ఇంధన సంక్షోభం వంటి సవాళ్ల నేపథ్యంలో భారత్-ఆస్ట్రేలియా వ్యూహాత్మక, ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తన మూడు దేశాల పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా పర్యటన చేపట్టిన ప్రధాని, గురువారం ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్తో కలిసి ఇండియా-ఆస్ట్రేలియా సీఈఓ ఫోరం,ఎకనామిక్ రోడ్మ్యాప్ బిజినెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ,ప్రపంచం ప్రస్తుతం అనిశ్చితి, సరఫరా గొలుసు అంతరాయాలు,ఇంధన సంక్షోభం వంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందన్నారు. ఇలాంటి సమయంలో భారత్,ఆస్ట్రేలియా సహజమైన,విశ్వసనీయ భాగస్వాములుగా కలిసి ముందుకు సాగడం అవసరమని పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా ఇరు దేశాలు తమ సామర్థ్యాలను మేళవించి భవిష్యత్ సహకారానికి బలమైన పునాది నిర్మించుకున్నాయని తెలిపారు.
ఆస్ట్రేలియా రాజధానిలో ప్రధాని మోదీకి లాంఛనప్రాయ స్వాగతం, గౌరవ వందనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ స్వాగతం పలికి, అనంతరం ఇరు దేశాల ప్రతినిధి బృందాలతో సమావేశమయ్యారు.
స్వచ్ఛ ఇంధన రంగంలో భారతదేశం చేపడుతున్న చర్యలను ప్రస్తావించిన మోడీ, దేశంలో జల విద్యుత్ ప్రాజెక్టులు, గ్రీన్ హైడ్రోజన్,సోలార్ మాడ్యూల్స్, విండ్ టర్బైన్ల తయారీకి బలమైన పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. 2030నాటికి 500గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించడం, 2070నాటికి నికర-సున్నా ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవడం భారత్ లక్ష్యమని చెప్పారు.ఈ దిశగా ఆస్ట్రేలియా సాంకేతికత, పెట్టుబడులు, వనరులు కీలక పాత్ర పోషించగలవని మోడీ పేర్కొన్నారు.








కామెంట్లు (0)