రెండు వారాల్లో లొంగిపోవాలని ఉత్తర్వులు
న్యూఢిల్లీ : తహెల్కా మాజీ ఎడిటర్, అత్యాచారం కేసులో నిందితుడు తరుణ్ తేజ్పాల్ కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. బొంబాయి హైకోర్టు తనను దోషిగా నిర్ధారిస్తూ ఇచ్చిన తీర్పుపై చేసిన అప్పీలు విచారణకు వచ్చే వరకు లొంగిపోకుండా మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను మంగళవారం సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ మేరకు రెండు వారాల వ్యవధిలో సంబంధిత అధికారుల ఎదుట లొంగిపోవాలని తేజ్పాల్ను ఆదేశించింది. జస్టిస్ ఆలోక్ అరాధే నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం, తరుణ్ తేజ్పాల్ లొంగిపోయినట్లు ధ్రువీకరించే సరిఫికేట్ను కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది. సెప్టెంబర్ 22లోగా లొంగిపోయినట్లు సర్టిఫికేట్ దాఖలు చేస్తే, అదే రోజున ఆయన క్రిమినల్ అప్పీలును విచారణకు స్వీకరించడానికి న్యాయస్థానం అంగీకరించింది. ముందుగా తన అప్పీలును సుప్రీంకోర్టు జాబితా చేసి విచారించాలనే కారణంతో తేజ్పాల్ లొంగుబాటు నుంచి మినహాయింపు కోరారు. తేజ్పాల్ తరఫున హాజరైన సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ... తగిన కేసుల్లో నిందితుడు లొంగిపోకపోయినా విచారణ జరిపి, లొంగుబాటు నుంచి మినహాయింపు ఇచ్చే అధికారం కోర్టుకు ఉందని తెలిపారు. గోవా ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ (SGI) తుషార్ మెహతా ఈ పిటిషన్ను తీవ్రంగా వ్యతిరేకించారు. కేసు తీవ్రత ఆధారంగానే మినహాయింపు దరఖాస్తును పరిశీలించాలని మనవి చేశారు. బొంబాయి హైకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ, ఇది దారుణమైన అత్యాచార నేరమని, తేజ్పాల్కు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడిందని గుర్తుచేశారు. ఆ అధికారం ఉన్నందునే తాము ఈ మినహాయింపు పిటిషన్ను విచారణకు స్వీకరించామని జస్టిస్ అరాధే వ్యాఖ్యానించారు. విచారణ కోర్టు ఇచ్చిన విముక్తి (అక్విట్టల్) ఉత్తర్వులను హైకోర్టు తప్పుపట్టి దోషిగా నిర్ధారించినందున, ఈ కేసుకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా విచారించాలని సిబల్ కోరారు. అయితే, తాము హైకోర్టు తీర్పును పరిశీలించామని తెలిపిన ధర్మాసనం... ఇరువర్గాలు (తేజ్పాల్, గోవా ప్రభుత్వం) కేవలం 'లొంగుబాటు మినహాయింపు' అంశానికే తమ వాదనలను పరిమితం చేయాలని స్పష్టం చేసింది.








కామెంట్లు (0)