- టెంట్లు కూడా వేసుకోనివ్వని పోలీసులు
- జడివానలోనే కొనసాగుతున్న సిజెపి ఆందోళన
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఉన్నత విద్యా కోర్సుల ప్రవేశాలు, ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ఉమ్మడి పరీక్షల ప్రశ్నాప్రతాలు లీక్ కావడం, మూల్యాకన పద్ధతుల్లో అక్రమాలు ఇలా విద్యా వ్యవస్థను, నియామకాల ప్రక్రియను అధ్వాన్నస్థితిలోకి నెట్టేసిన కేంద్ర ప్రభుత్వం..ఈ దుర్మార్గాన్ని ప్రశ్నించేవారిపైనా తీవ్రమైన అణచివేత చర్యలకు పాల్పడుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, అక్రమాలకు నెలవుగా మారిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టిఎ)ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) జడివానలోనే తమ పోరాటాన్ని కొనసాగిస్తోంది. వీరికి మద్దతుగా దీక్ష కొనసాగిస్తున్న సామాజిక, పర్యావరణ కార్యకర్త వాంగ్చుక్ శుక్రవారం కూడా తన దీక్ష కొనసాగించారు. అయితే వర్షం పడుతున్నకారణంగా టెంట్లు వేసుకొని నిరశన కొనసాగించాలని బయట నుంచి టార్ఫాలిన్లు తెచ్చుకునేందుకు సిజెపి కార్యకర్తలు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. సిజెపి వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే పోలీసుల కాళ్లు పట్టుకొని బతిమలాడినా ఖాకీలు కరుణించలేదు. ప్రభుత్వం ఇలాంటి వాటికి అనుమతించడం లేదని అందువల్ల టార్ఫాలిన్లు లోపలికి తీసుకురావడానికి వీలులేదని పోలీసులు తేల్చి చెప్పారు. అయితే ఇందుకోసం ఖాకీల కాళ్లు పట్టుకొని అభిజిత్ విన్నవిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీంతో అభాసుబాలు అవుతామని భావించిన కేంద్ర ప్రభుత్వం ఆ వీడియోను తొలగించాలని సామాజిక మాధ్యమాలకు ఆదేశించినట్లు తెలుస్తోంది. స్థానిక ఆంక్షలను పరిగణలోకి తీసుకొని వీడియో తొలగిస్తున్నామని ‘ఎక్స్’ పేర్కొంది. దీనిపై అభిజిత్ స్పందిస్తూ టార్ఫాలిన్ల కోసం పోలీసుల కాళ్లు పట్టుకోవడం కూడా నేరమేనా? అని కేంద్ర ప్రభుత్వ తీరుపై విస్మయం వ్యక్తం చేశారు. కాగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ సిజెపి చేపట్టిన ఆందోళన శుక్రవారం నాటికి 21 రోజులు పూర్తి చేసుకుంది. పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన నిరాహార దీక్ష 13 రోజులు పూర్తి చేసుకుంది.








కామెంట్లు (0)