న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియా పైలట్లకు నిర్వహిస్తున్న విస్తృత డ్రగ్ స్క్రీనింగ్లో మరో ఇద్దరు పైలట్లు ప్రాథమిక పరీక్షలో విఫలమైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే వారు నిషేధిత మత్తు పదార్థాలు తీసుకున్నారా, లేక వైద్యుల సూచనల మేరకు వినియోగిస్తున్న మందుల కారణంగానే పరీక్షలో ప్రతికూల ఫలితం వచ్చిందా అనేది నిర్ధారించాల్సి ఉంది. ఇందుకోసం వారి నమూనాలకు ధ్రువీకరణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. తుది ఫలితాలు వచ్చే వరకు ముందుజాగ్రత్త చర్యగా ఇద్దరినీ విమాన విధుల నుంచి తప్పించినట్లు సమాచారం.
400 మంది పైలట్లకు పరీక్షలు
ఫుకెట్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమాన కెప్టెన్కు నిర్వహించిన నిర్ధారణ పరీక్షలో గంజాయి ఉన్నట్లు తేలిన ఘటన నేపథ్యంలో సంస్థ తన పైలట్లందరికీ విస్తృత స్థాయిలో డ్రగ్ స్క్రీనింగ్ చేపట్టింది. ఇప్పటివరకు సుమారు 400 మంది పైలట్లకు పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం సాధారణంగా ప్రతి ఏడాది విమాన సిబ్బందిలో కనీసం 10 శాతం మందిని యాదృచ్ఛికంగా డ్రగ్ పరీక్షలకు ఎంపిక చేయాల్సి ఉంటుంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఎయిర్ ఇండియా అంతకంటే విస్తృత స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తోంది.
ప్రాథమిక పరీక్ష కంటే తుది నిర్ధారణే కీలకం ....
తాజాగా ఇద్దరు పైలట్లు ప్రాథమిక డ్రగ్ స్క్రీనింగ్లో విఫలమైనట్లు సమాచారం. అయితే ప్రాథమిక పరీక్ష ఫలితాన్ని మాత్రమే తుది నిర్ధారణగా పరిగణించరు. కొన్ని మందులు, వైద్య చికిత్సలో ఉపయోగించే పదార్థాల కారణంగా కూడా స్క్రీనింగ్ పరీక్షల్లో అనుమానాస్పద ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. దీంతో వారి నమూనాలను మరింత కచ్చితమైన నిర్ధారణ పరీక్షలకు పంపినట్లు తెలుస్తోంది. తుది ఫలితాలు వచ్చిన తర్వాతే వారు నిషేధిత పదార్థాలు తీసుకున్నారా లేదా అనేది స్పష్టమవుతుంది.
ఫుకెట్-ఢిల్లీ విమానంలో ఏం జరిగింది ?
ఈ విస్తృత డ్రగ్ పరీక్షలకు దారితీసిన ప్రధాన ఘటన ఆగస్టు 4న జరిగిన ఫుకెట్-ఢిల్లీ AI2379 విమానానికి సంబంధించినది. ఎయిర్బస్ A320neo విమానం ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా సుమారు 300 అడుగుల ఎత్తు కోల్పోయింది. ఈ ఘటనలో 24 మంది ప్రయాణికులు, సిబ్బంది గాయపడినట్లు సమాచారం. అనంతరం విమానం ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఘటన తర్వాత విమానంలోని ఇద్దరు పైలట్లకు తప్పనిసరి డ్రగ్ స్క్రీనింగ్ నిర్వహించారు.
కెప్టెన్ పరీక్షలో గంజాయి గుర్తింపు ....
విమానం ల్యాండ్ అయిన తర్వాత నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో కెప్టెన్కు అనుమానాస్పద ఫలితం వచ్చినట్లు సమాచారం. అనంతరం నిర్వహించిన నిర్ధారణ ప్రయోగశాల పరీక్షలో గంజాయి ఉన్నట్లు తేలినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో విచారణ పూర్తయ్యే వరకు కెప్టెన్, ఫస్ట్ ఆఫీసర్ను విమాన విధుల నుంచి తప్పించారు. ఇదిలా ఉండగా విమానం అకస్మాత్తుగా ఎత్తు కోల్పోవడానికి గల అసలు కారణంపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఎయిర్బస్ ప్రాథమిక విశ్లేషణ ప్రకారం విమానంలోని మూడు హైడ్రాలిక్ వ్యవస్థల్లో తాత్కాలికంగా ఒత్తిడి తగ్గినట్లు సమాచారం. విమాన నియంత్రణ వ్యవస్థకు సంబంధించిన అంశాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.








కామెంట్లు (0)