రక్తానికి ప్రత్యామ్నాయం లేదు. రక్తం దానంతో ప్రాణాలు నిలబడతాయి, కుటుంబాలు నిలుస్తాయి. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల రోగులు రక్త దాతల అమూల్య సేవలతో ప్రాణాలను నిలుపుకుంటున్నారు. రక్తంలో ఏ, బి, ఓ అనే వర్గాలు వుంటాయని కనుగొన్న నోబెల్ పురస్కార గ్రహీత “కార్ల్ ల్యాండ్ స్టేయినర్” పుట్టిన రోజైన జూన్ 14న ఈ దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీ. ఈ ఏడాది ఇతివృత్తంగా “ఒక బిందువు మానవత్వం : రక్త దానం చేద్దాం, ప్రాణాలు కాపాడుకుందాం” అనే అంశాన్ని తీసుకున్నారు. రక్తం, ప్లేట్లెట్ల లాంటి ఇతర రక్త ఉత్పత్తులను దానం చేసే వారి కొరత మన దేశంలో బాగా వుంది. 18 నుంచి 65 ఏళ్ల వయస్సు ఉన్న ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ ఎప్పుడైనా రక్తదానం చేయవచ్చు. ప్రతి మూడు నెలలకు ఒకసారి పురుషులు, ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మహిళలు రక్తదానం చేయవచ్చు. రక్తదాత శరీర బరువు 45 కేజీలకు మించి ఉండాలి. రక్తంలో కనీస హిమోగ్లోబిన్ 12.5 గ్రాములు ఉండాలి. సాధారణంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి వెయ్యి మందిలో 33 మంది రక్తదానం చేస్తుండగా, భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నలుగురు మాత్రమే రక్త దానానికి ముందుకు వస్తున్నారు. ప్రభుత్వాలు, బ్లడ్ బ్యాంకులు, ఆసుపత్రులు, స్వచ్ఛంద సేవకులు, ఉన్నత విద్యా సంస్థలు కలిసి ప్రపంచ రక్త దాతల దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ అవగాహన కల్పించాలి.
(జూన్ 14 ప్రపంచ రక్త దాతల దినోత్సవం)
- డా. బి.ఎం.ఆర్, సెల్: 9949700037








కామెంట్లు (0)