సెమీస్లో ఇంగ్లండ్పై సంచలన విజయం
వరుసగా రెండోసారి టైటిల్ పోరుకు మెస్సీ సేన
అట్లాంటా: ఫుట్బాల్ చరిత్రలో అర్జెంటీనా జట్టు సువర్ణాధ్యాయాన్ని లిఖించింది. వరుసగా రెండోసారి ఫైనల్కు చేరిన జట్టుగా మెస్సీ సేన నిలిచింది. బుధవారం అర్ధరాత్రి జరిగిన రెండో సెమీఫైనల్లో లియోనెల్ మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా జట్టు 2-1గోల్స్ తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది. రెండో అర్ధబాగం 55వ నిమిషంలో ఇంగ్లండ్ ఒక గోల్ చేయడం, 85వ నిమిషం వరకు 1-0 ఆధిక్యతలో నిలవడంతో ఇగ్లండ్ గెలుపు లాంచనమే అనుకున్నా.. ఆ తర్వాత కేవలం 7 నిమిషాల వ్యవధిలో అర్జెంటీనా 2గోల్స్ కొట్టి అభిమానుల్లో ఫుల్ జోష్ నింపింది. లియోనెల్ మెస్సీ అందించిన ఆ రెండు అద్భుత పాస్లతో అర్జెంటీనా 2-1 తేడాతో ఇంగ్లాండ్ను ఓడించి వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్కు చేరుకుంది.
మెర్సిడెస్-బెంజ్ స్టేడియంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన సెమీస్ మ్యాచ్కు ఇరు దేశాల భారీగా అభిమానులు హాజరయ్యారు. దీంతో విపరీతమైన కోలాహలం నెలకొంది. తొలి అర్థభాగంలో ఫౌల్స్తోనే మ్యాచ్కు కొంత అంతరాయం కలిగింది. మూడో నిమిషంలో ఎంజో ఫెర్నాండెజ్ చేసిన ఫౌల్ ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ఇంగ్లాండ్ జట్టు మెస్సీని ముట్టడించి స్వేచ్ఛగా ఆడే అవకాశాన్ని ఏ మాత్రం ఇవ్వలేదు. అర్జెంటీనాకు చెందిన మార్టినెజ్, ఇంగ్లాండ్కు చెందిన ఇలియట్ అండర్సన్ కూడా యెల్లో కార్డులు అందుకున్నారు. దీంతో తొలి అర్ధభాగం 0-0తో ముగిసింది. రెండో భాగంలో మ్యాచ్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. 55వ నిమిషంలో ఇంగ్లాండ్ ఆటగాడు మోర్గాన్ రోడ్జర్స్ అందించిన అద్భుతమైన పాస్ను ఆంథోనీ గోర్డాన్ గోల్గా మలిచాడు. దీంతో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యాన్ని సాధించింది. ఆ తర్వాత దాదాపు 30 నిమిషాలపాటు అర్జెంటీనా గోల్ కోసం పోరాడినా ప్రయోజనం లేకపోయింది.
చివరి 7 నిమిషాల్లో అర్జెంటీనా మెరుపులు
అర్జెంటీనా అభిమానులు ఆశ కోల్పోతున్న దశలో లియోనెల్ మెస్సీ 85వ నిమిషంలో ఇంగ్లాండ్ డిఫెండర్లను తప్పించుకుని బంతిని ఎంజో ఫెర్నాండెజ్కు పాస్ చేశాడు. ఫెర్నాండెజ్ బాక్స్ బయటి నుంచి బుల్లెట్ లాంటి షాట్ కొట్టడంతో ఆ బంతి ఇంగ్లాండ్ గోల్ పోస్ట్లో పడింది. దీంతో స్కోరు 1-1తో సమమైంది. మ్యాచ్ అదనపు సమయంకు వెళ్తుందనుకున్న దశలో.. ఇంజ్యూరీ సమయంలో మెస్సీ మరో కచ్చితమైన పాస్ ఇవ్వగా.. లౌటారో మార్టినెజ్ ఎలాంటి పొరపాటు చేయకుండా దానిని గోల్గా మలిచాడు. కేవలం 7 నిమిషాల్లోనే వ్యవధిలోనే అర్జెంటీనా రెండో గోల్స్ కొట్టి స్కోర్ను 2-1కు మార్చేసింది. దీంతో మెస్సీ తన సహచర ఆటగాళ్లను కౌగిలించుకొని కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ 39 ఏళ్ల ఆటగాడు ఇప్పుడు వరుసగా రెండో ఫిఫా ప్రపంచ కప్ను గెలవడానికి కేవలం ఒక్క అడుగు దూరంలో జట్టును నిలిపాడు. ఆదివారం న్యూజెర్సీలో జరిగే ఫైనల్లో అర్జెంటీనా జట్టు స్పెయిన్తో తలపడనుంది. 3వ స్థానంకోసం ఫ్రాన్స్-ఇంగ్లండ్ జట్లు శనివారం తలపడనున్నాయి.







కామెంట్లు (0)