ప్రజాశక్తి-పాడేరు: ఎన్నికల విధులకు ప్రత్యేకంగా కేటాయించబడిన అధికారులందరూ ఎన్నికల నిభందనలకు లోబడి విధులు సక్రమంగా నిర్వర్తించాలని జిల్లా రెవిన్యూ అధికారి బి.పద్మావతి కోరారు. సోమవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో వివిధ నోడల్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో డిఆర్ఓ మాట్లాడుతూ, వివిధ దినపత్రికలలో వచ్చిన వార్తలు, ఫిర్యాదుల విభాగానికి వచ్చే ఫిర్యాదులు, సివిజిల్కు వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు వెంటనే స్పందించి నివేదికలు సమర్పించాలన్నారు. ఈ సందర్భంగా నోడల్ అధికారులు నివేదికలను పంపేందుకు అవసరమైన నిర్ణీత ప్రోఫార్మాలపై అవగాహన కల్పించారు. ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియామావళి అమలులో ఉన్నందున రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫోటోలు, రాతలు, పోస్టర్లు, బ్యానర్లు తొలగించాలన్నారు. విగ్రహాలకు ముసుగులు వేయాలన్నారు. అందుకు అవసరమైన సమాచారాన్ని సంబంధిత నోడల్ అధికారులకు తెలియజేయాలన్నారు. వివిధ నోడల్ అధికారులకు కేటాయించిన సిబ్బంది హాజరును పరిశీలించిన డిఆర్ఓ విధులను వివరించారు. ఈ సమావేశంలో ప్రత్యెక ఉప కలెక్టర్లు పి.అంబేద్కర్, భవాని, మీడియా మోనటరింగ్ నోడల్ అధికారి పి.గోవింద రాజులు, కమ్యునికేషన్ నోడల్ అధికారి ఎ.రమేష్ కుమార్రావు, సివిజిల్ మోనటరింగ్ నోడల్ అధికారి కే.సాయి నవీన్, వ్యయ పర్యవేక్షణ నోడల్ అధికారి పిఎస్ కుమార్, ఫిర్యాదుల నోడల్ అధికారి ఎం.వి.రామకృష్ణరాజు, సోషల్ మీడియా నోడల్ అధికారి పి.రాములు, సీజర్ నోడల్ అధికారి సుధాకర్ పాల్గొన్నారు.పకడ్బందీగా అమలు: పిఓ అభిషేక్:అరకులోయ:అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి పకడ్బందీగా అములు చేయాలని అరకు అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, ఐటిడిఏ పిఓ వి.అభిషేక్ స్పష్టం చేసారు. సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఎన్నికల సిబ్బందితో సమావేశం నిర్వహిం ఎన్నిక ప్రవర్తనా నియమావళిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలింగ్ రోజున అభ్యర్దులు ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించ కూడదన్నారు. పోలింగ్ కేంద్రాలకు రవాణా ఇబ్బందులుంటే అధికారులు సదుపాయాలు కల్పించాలని సూచించారు.పోస్టర్లు, హౌర్డింగ్స్ తొలగించడంపై విధిగా రిజిష్టరులో నమోదు చేయాలని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు భవనాలపై ప్రచార కరపత్రాలు, గోడ పత్రికలను అతికించ కూడదన్నారు. ఎన్నికల సంఘం నిబంధనలు మేరకు రానున్న సార్వత్రిక ఎన్నికలను సమర్దవంతంగా నిర్వహించాలని చెప్పారు. ఎన్నికల నియమావళిపై ఎన్నికల సిబ్బందికి అవగాహన ఉండాలన్నారు.అప్రమత్తంగా ఉంటూ విధులను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో తహశీల్దారులు, ఎంపిడిఓలు, సెక్టర్, బూత్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.