న్యూఢిల్లీ : మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టింది. బెయిల్ విషయంపై ట్రయల్ కోర్టుకే వెళ్లాలని సూచించింది. పిటిషన్లోని అంశాలపై ఈడీకి నోటీసులు ఇస్తామని సుప్రీం కోర్టు తెలిపింది. ప్రస్తుతం ఈ కేసు మెరిట్స్లోకి వెళ్లడం లేదని స్పష్టం చేసింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లే స్వేచ్ఛ ఉందని ధర్మాసనం వివరించింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీలో ఉన్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో గురువారం కూడా కవితను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఇక, లిక్కర్ స్కాంకు సంబంధించి గత బుధవారం రాత్రి వరకు కవిత పీఏలు రాజేష్, రోహిత్లను ఈడీ అధికారులు విచారించారు. ఇప్పటి వరకు సీజ్ చేసిన ఫోన్ల లాక్ తీయించి అందులోని సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు ప్రశ్నలు సంధించారు.