- జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో సుప్రీం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ రాజకీయ కారణాలతో జాప్యం కారాదు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వైఎస్ జగన్ కేసులో విచారణ ఆలస్యం అవుతుందని ఎంపి రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ను న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా జగన్ అక్రమాస్తుల కేసుల్లో విచారణ ఎందుకు ఆలస్యమవుతోందని సిబిఐని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి గల కారణాలు చెబుతూ నాలుగు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని, విచారణ వేగంగా పూర్తి చేయాలని సిబిఐని ఆదేశించింది. డిశ్చార్జ్ పిటిషన్ల కారణంగా జాప్యమవుతోందని సిబిఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు తెలిపారు. రాజకీయ నేత సిఎం అనే కారణాలతో విచారణలో జాప్యం జరగకూడదని జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్నారు. బెయిల్ రద్దు, కేసు విచారణ తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ పిటిషన్లను కలిపే విచారణ చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 5 నుంచి ప్రారంభమయ్యే వారానికి వాయిదా వేసింది. వైఎస్ జగన్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, రఘురామ కృష్ణరాజు తరఫున సీనియర్ న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ వాదనలు వినిపించారు.