- ఎన్నికల అధికారి కిరణ్మయి
ప్రజాశక్తి – వన్టౌన్ : పశ్చిమ నియోజకవర్గంలో మొత్తం 253 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని పశ్చిమ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కే. కిరణ్మయి తెలిపారు. శనివారం భవానీపురంలోని పశ్చిమ ఆర్.ఒ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి కె.కిరణ్మయి మాట్లాడుతూ ఈ నెల 21 ఆదివారం సెలవు దినం అవడంతో నామినేషన్లు స్వీకరించబడవని, మరల ఈనెల 22 సోమవారం నుండి యధావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ నెల 25 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించబడతాయని ఆమె తెలిపారు. ఈనెల 26 నుండి స్కృట్నీ జరుగుతుందని ఆమె తెలిపారు. నామినేషన్ స్వీకరణకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, నామినేషన్ సమర్పించు అభ్యర్థులు వారితోపాటు నలుగురు మాత్రమే రావాలని కోరారు. ఇప్పటివరకు ప్రధాన పార్టీ అభ్యర్థులు నామినేషన్లు స్వీకరించినట్లు తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో 97 సమస్యాత్మక పోలింగ్ బూత్లను గుర్తించినట్లు తెలిపారు. దీనిపై అధికారులకు నివేదిక పంపామని తెలిపారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన కేసులను నాలుగు నమోదు చేశామని పేర్కొన్నారు. పోలింగ్ బూత్లలో సౌకర్యాలపై దృష్టి సారిస్తున్నామని, ఎన్నికల తేదీకి పది రోజులు ముందు నుండే సౌకర్యాలు కల్పించేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ జరిగేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.