సౌకర్యాల కల్పనలో అధికారులు విఫలం
ప్రజాశక్తి – భీమవరం రూరల్
పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భీమవరం నియోజకవర్గంలో 236 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. భీమవరం పట్టణంలో పోలింగ్ కేంద్రాల వద్ద నిర్వహణ మరింత దారుణంగా ఉంది. ఓటర్లకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమయ్యారని ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం తాగునీరు కూడా ఏర్పాటు చేయలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని పోలింగ్ కేంద్రాలు ఇరుకుగా ఉండటంలో ఓటర్లు పలు ఇబ్బందులకు గురయ్యారు. కొంతమంది ఓటర్లు అస్వస్థతకు గురయ్యారు. జిల్లా కేంద్రంలోని ఎన్నికల నిర్వహణ ఇలా ఉంటే ఇంకా ఇతర నియోజకవర్గంలో, మండల కేంద్రంలో పోలింగ్ బూత్ వద్ద ఏర్పాట్లు ఎలా చేసుంటారని సర్వత్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారిని పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు పెద్ద ఆపరేషన్ వంటివి చేయించుకుని వచ్చినవారిని ఎండలోనే గంటల తరబడి నిలబెట్టిన పరిస్థితి నెలకొంది. ఏర్పాట్లపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి బాధ్యులపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని ఓటర్లు కోరుతున్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/05/2222-2.jpg)