ప్రజాశక్తి – హెల్త్ యూనివర్సిటీ : డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవలను పటమటలోని యాదవుల బజారులో ఉన్న పి.వి.ఆర్. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రారంభించినట్లు హాస్పిటల్ అడ్వైజర్, మెడికల్ కౌన్సిల్ అఫ్ ఇండియా మాజీ మెంబెర్ డాక్టర్ సి.ఎల్.వెంకటరావు తెలిపారు. ఆదివారం హాస్పిటల్లో జరిగిన కార్యక్రమంలో వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ సేవలను ముఖ్య అతిథులుగా పాల్గొన్న విశ్రాంత అధికారి ఎస్.బి.వి.రమణకుమార్, పూర్వపు ప్రిన్సిపాల్ సెక్రటరీ బి.ఉదయలక్ష్మి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం అనంతరం ఉదయలక్ష్మి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, పేద, మధ్య తరగతి వర్గాల వారికి డా. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఒక వరం అని ప్రశంసించారు. ఇకపై పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ ద్వారా సూపర్ స్పెషాలిటీ సేవలు ఉచితంగా లభిస్తాయని, స్వతహాగా డాక్టర్ పీవీఆర్ చౌదరి హాస్పిటల్ ప్రారంభం నుండి అందరికి అందుబాటులో వైద్యసేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. తమ హాస్పిటల్లో అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్నామని భవిష్యత్తులో పేదల కోసం తక్కువ వ్యయంతో వైద్యసేవలు అందిస్తామని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ పి.వి.ఆర్.చౌదరి తెలిపారు. కార్యక్రమంలో విజయ ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ చైర్మన్ తట్టి అర్జునరావు, హాస్పిటల్ సీఈవో, ప్రముఖ న్యూరో సర్జన్ పువ్వాడ రామకష్ణ, పలువురు రాజకీయ నాయకులు, వైద్యులు పాల్గొన్నారు.