గాజా : ఇజ్రాయెల్ సైన్యం గాజాపై మళ్లీ దాడులు ప్రారంభించింది. వారం రోజుల కాల్పుల విరమణ అనంతరం ఇజ్రాయెల్ శుక్రవారం ఉదయం నుంచే దాడులు ప్రారంభించింది. మళ్లీ మొదలైన ఈ దాడుల్లో 178 మంది మృతి చెందారని, సుమారు 589 మందికి గాయపడ్డారని గాజాలోని హమాస్ నియంత్రిత ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. అయితే తాజా దాడులకు హమాస్నే కారణమని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్) ఆరోపించింది. హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై క్షిపణులు ప్రయోగించారు. దీంతో మళ్లీ దాడులు ప్రారంభించడం జరిగింది అని ఐడిఎఫ్ శనివారం సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా పేర్కొంది. ఇజ్రాయెల్- హమాస్ సంధి ప్రకారం.. నవంబర్ 24-30 తేదీ వరకు 80 మంది ఇజ్రాయిలీలు, 24 మంది విదేశీపౌరులను హమాస్ విడుదల చేయగా.. 240 మంది పాలస్తీనా ఖైదీదలను ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసింది. అయితే గాజాలో 17 మంది మహిళలు, పిల్లలతో సహా 136 మంది బంధీలుగా ఉన్నారని ఐఎడిఎఫ్ తెలిపింది. ప్రస్తుతం ఇజ్రాయెల్ సైన్యం గాజాలోని నివాస ప్రాంతాలపై దాడులు కొనసాగిస్తోంది. దక్షిణ గాజాలోని ప్రాంతాలను ఖాళీ చేయాలని ఆదేశిస్తూ శుక్రవారం ఐడిఎఫ్ కరపత్రాలను జారవిడిచింది.