రాజమహేంద్రవరం ప్రతినిధి మున్సిపల్ ఉపాధ్యా యుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి ఎ.షరీఫ్ డిమాండ్ చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మంగళవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖ పర్యవేక్షణలోకి మున్సిపల్ ఉపాధ్యాయులను తీసుకువస్తూ జిఒ 84ను ప్రభుత్వం విడుదల చేసిందని, దీనివల్ల మున్సిపల్ సమస్యలు పరిష్కారమవుతాయని భావించామన్నారు. మున్సిపల్ ఉపాధ్యాయుల డిడిఒ పవర్తోపాటు కొన్ని సమస్యలు పరిష్కారమైనా, ప్రధానమైన సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ప్రధానంగా బదిలీలు, ప్రమోషన్లు తక్షణం నిర్వహించాలని, మున్సిపల్ ఉన్నత పాఠశాలల్లో అన్ని పోస్టులూ అప్గ్రేడ్ చేయాలని, మున్సిపల్ టీచర్లకు పిఎఫ్ సౌకర్యం వెంటనే కల్పించాలని, మెడికల్ రీయంబర్స్మెంట్ బిల్లులు కొత్త డిడిఒల ద్వారా దరఖాస్తు చేసుకునే సౌకర్యం కల్పించాలని, పాఠశాలల అన్నింటికీ బోధనేతర సిబ్బందిని నియమించాలని, భవనాల అద్దె, కరెంట్ బిల్లులు చెల్లించాలని, అన్ని రకాల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రెండో దశ కార్యాచరణలో అన్ని జిల్లా కేంద్రాల్లో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిరసన కార్యక్రమాలకు పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు పి.జయకర్, ఉపాధ్యక్షురాలు ఎం.విజయగౌరి, జిల్లా కార్యదర్శులు శ్రీమణి, రవిబాబు, రమేష్బాబు, దయానిది, జి.అప్పారావు, జెవివి.సుబ్బారావు, తేజ, విజరు కుమార్, అనిత, గంగాధరరావు పాల్గొన్నారు.