ప్రజాశక్తి-సిఎస్ పురం రూరల్: నేషనల్ హైవే నిర్మాణంలో కోల్పోతున్న తమ భూములకు పరిహారం ఇప్పించాలని భూ యజమానులు కోరుతున్నారు. సిఎస్ పురం గ్రామానికి చెందిన బండారు వేమయ్య, బత్తుల వెంకటేశ్వర్లు, బండారు బాబు, బండారు పెద్ద తిరుపతయ్య తదితర రైతులు శుక్రవారం తహశీల్దారు నాగుల్ మీరాను కలిశారు. సిఎస్ పురం రెవెన్యూలోని 138, 163, కోయిలంపాడు రెవెన్యూలోని 99, 101 తదితర సర్వే నెంబర్లలో తమకు చెందిన భూమి వున్నదని, మైదుకూరు సింగరాయకొండ హైవే రోడ్డు నిర్మాణంలో భాగంగా ప్రస్తుతం తమ భూములలో పనులు జరుగుతున్నట్లు చెప్పారు. ఆ భూములకు సంబంధించి ఇప్పటి వరకు పరిహారం తమకు అందలేదన్నారు. తమకు సంబంధించిన భూమి ఎంత మేర రోడ్డు నిర్మాణంలో పోతుందో కొలత వేయించి వెంటనే పరిహారం అందించాలని వారు తహశీల్దారును కోరారు.