ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : హజరత్ సయ్యద్ ఖాదర్ వలీ బాబా 65వ ఉరుసు మహోత్సవాలు గురువారం ముగిశాయి. మూడు రోజుల పాటు ఘనంగా జరిగిన ఈ ఉత్సవాల్లో దేశ నలుమూలల నుంచి విచ్చేసిన భక్తులు ఖాదర్ బాబా దర్గాలో సుగంధ, చాదర్ సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సూఫీ పరంపర మహనీయులను స్మరించుకుంటూ విశ్వ శాంతి కోసం దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అనేక మంది ప్రముఖులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు ఖాదర్ బాబా దర్గా, దర్బార్ షరీఫ్ కు విచ్చేసి దర్శనం చేసుకున్నారు. మూడు రోజుల పాటు నిర్వీ్షమంగా నిర్వహించిన భారీ లంగర్ ఖానాలో లక్షల మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. సూఫీ పీఠాధిపతి హజరత్ ముహమ్మద్ అతావుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ బాబా వారి అధ్యాత్మిక వారసుడు, సజ్జాద నషీన్ ముహమ్మద్ ఖాజా మోహియుద్దీన్ షా ఖాదరి విశ్వ శాంతిని కాంక్షిస్తూ, ప్రేమ తాత్వాన్ని ప్రభోదిస్తూ భక్తులకు తమ సందేశాన్ని అందించారని దర్గా దర్బార్ ధర్మకర్త ఖలీల్ బాబు తెలిపారు. దర్గాను దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ ఖాదర్ నగర్లోగల ఖాదర్బాబా దర్గాను గురువారం డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్లు గాదం మురళి, మారోజు శ్రీనివాసరావు మాట్లాడుతూ పేదలకు స్వాంతన చేకూర్చేలా ఆనాడు బాబా అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, గదుల సత్యలత, వేముల రాంప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.