ప్రజాశక్తి-గిద్దలూరు: వంద మందిలో ఉన్నా మీకు ఓ ప్రత్యేకత ఉండాలంటే చదువు ఒక్కటే మార్గమని మాజీ శాసనసభ్యులు ముత్తుముల అశోక్రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ఎస్ఎస్ కన్వెన్షన్ హాలులో సాహితీ జూనియర్ కాలేజ్ ఫేర్వెల్ డే వేడుకల సభలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ఒక పేద కుటుంబానికి సమాజంలో ఉన్నత స్థానం కలగాలంటే ఒకే ఒక మార్గం విద్య అని, సాధారణ వ్యక్తులను సైతం ప్రపంచం గర్వించే స్థాయికి చేరుస్తుందని అన్నారు. జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు పి స్వరూపరెడ్డి మాట్లాడుతూ జీవితమన్నది పరీక్షల కంటే ఎంతో విలువైనదని, పరీక్షలు జీవన్మరణ సమస్య కానేకాదని, ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సిద్ధం కావాలని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ పి కొండారెడ్డి మాట్లాడుతూ ఇంతటి ఘన విజయానికి కారకులైన విద్యార్థులకు, సాహితీ విద్యాసంస్థపై నమ్మకం ఉంచి వారి బిడ్డలను చదివిస్తున్న తల్లిదండ్రులకు, ఉన్నత ఫలితాలను సాధించడానికి కృషి చేస్తున్న అధ్యాపక బృందానికి ధన్యవాదాలు తెలియజేశారు. విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కతిక కార్యక్రమాలు చూపరులను అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాలల కరస్పాండెంట్లు జి రంగస్వామిరెడ్డి, కే రామిరెడ్డి, ఎం చంద్రశేఖర్, షేక్ అచ్చుకట్ల ఖాజావలి, సుబ్బారెడ్డి, శివ, కళాశాల అధ్యాపకులు పి శిరీషరెడ్డి, కె భాస్కర్, బి నాగిరెడ్డి, పి మురళీమోహన్రెడ్డి, ఎం శివశంకర్రెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.