ప్రజాశక్తి పార్వతీపురం రూరల్ : ఫారం – 6,7,8లపై అభ్యంతరాలుంటే తెలియజేయాలని ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఎన్నికల సంబంధిత అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికలు సజావుగా నిర్వహించుటకు అన్ని చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. తుది ఓటరు జాబితా ప్రకటన అనంతరం అందిన ఫిర్యాదులు, మీడియా నివేదికల ఆధారంగా విచారణ చేపట్టి 1128 తొలగించామన్నారు. వాటిలో 257 మంది చనిపోయారని తెలిపారు. జిల్లాలో 244 పోలింగు స్టేషన్లలో 1037 పోలింగు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. 26 పోలింగు స్టేషన్ల లొకేషన్లు, 244 పోలింగు కేంద్రాలు పేర్ల మార్పు కోసం ఎన్నికల కమిషన్కు ప్రతిపాదనలు పంపించామని వివరించారు. ఈ సమావేశంలో డిఆర్ఒ జి.కేశవ నాయుడు, టిడిపి ప్రతినిధి జి.వెంకటనాయుడు, లోక్సత్తా ప్రతినిధి కొత్తకోట పాపారావు, జనసేన ప్రతినిధి పైలా శ్రీనివాస రావు, సిపిఎం ప్రతినిధి పి. రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.