ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా అదాని

Jan 6,2024 11:08 #Business
  • రెండో స్థానానికి అంబానీ

న్యూఢిల్లీ : ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా మళ్లీ గౌతం అదాని తొలి స్థానంలోకి వచ్చారు. ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న ముకేష్‌ అంబానీ రెండో స్థానంలోకి పడిపోయారు. బ్లూమ్‌బర్గ్‌ గ్లోబల్‌ బిలియనీర్‌ ఇండెక్స్‌ ప్రకారం.. ఒక్క రోజులోనే అదాని సంపద 7.7 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.64వేల కోట్లు) పెరిగి 97.6 బిలియన్‌ డాలర్లకు (దాదాపు రూ.8.10 లక్షల కోట్లు)చేరింది. రిలయన్స్‌ ఇండిస్టీస్‌ అధిపతి ముకేష్‌ అంబానీ సంపద విలువ 97 బిలియన్లు(దాదాపు రూ.8 లక్షల కోట్లు)గా నమోదయ్యింది. అదాని కంపెనీలు కృత్రిమ విలువకు పాల్పడుతున్నాయని.. అనేక ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నాయని 2023 జనవరిలో హిండన్‌బర్గ్‌ రిపోర్టు చేయడంతో అదాని కంపెనీల షేర్లు అమాంతం పడిపోయాయి. గతేడాదిలో స్టాక్‌ మార్కెట్‌లో ఆయన కంపెనీలు దాదాపు 150 బిలియన్ల డాలర్ల (దాదాపు రూ.12 లక్షల కోట్లు)మార్కెట్‌ను ఆయన కోల్పోయాయి. దీంతో బిలియనీర్ల జాబితాలో ఆయన స్థానం అమాంతం పడిపోయింది.అదాని గ్రూపునపై వచ్చిన ఆరోపణలకు ఆధారాలు లేవని సెబీ తన దర్యాప్తులో పేర్కొనడం.. సుప్రీంకోర్టు కూడా అదే తరహాలో స్పందించడంతో తిరిగి అదాని కంపెనీల స్టాక్స్‌కు మద్దతు లభించింది. విచారణను ప్రత్యేక దర్యాప్తు బఅందం (సిట్‌) లేదా సిబిఐకి బదిలీ చేయడానికి నిరాకరించింది. కాగా.. పెండింగ్‌లో ఉన్న రెండు కేసులను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని సెబీకి సూచించింది. దీంతో అదానీ గ్రూప్‌ షేర్లు రెండు రోజులుగా పరుగులు పెట్టాయి. అంతర్జాతీయంగా గౌతం అదాని 12వ స్థానంలో నిలువగా.. ముకేష్‌ అంబానీ 13వ స్థానంలో ఉన్నారు.

➡️