ప్రజాశక్తి – భోగాపురం : మండలంలోని ముక్కాం జగనన్న కాలనీలో ఐరన్, సిమెంట్ పక్కదారి పట్టినట్లు వచ్చిన ఫిర్యాదు పై మండల ప్రత్యేకాధికారి ఎం. సుధారాణి శనివారం విచారణ చేపట్టారు. ఈ కాలనీలో అక్రమాలు జరిగినట్లు గతంలో ఫిర్యాదులు అందడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సచివాలయంలో లబ్ధిదారులతో ఆమె మాట్లాడారు. ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు అందజేసిన సిమెంట్ ఐరన్ వివరాలను ఇచ్చింది, లేనిది అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొంతమంది లబ్ధిదారుల వద్ద స్టేట్మెంటును రికార్డ్ చేసుకున్నారు. ఆమె లబ్ధిదారులతో మాట్లాడుతూ చాలామంది లబ్ధిదారులు నేటికి ఇల్లు నిర్మాణాలు పూర్తి చేయలేదని, చాలామంది ప్రారంభించలేదని చెప్పారు. వీరు వెంటనే నిర్మాణం చేయకపోతే మంజూరైన ఇండ్లను ప్రభుత్వం రద్దు చేస్తుందని హెచ్చరించారు. విచారణపై పూర్తి నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు అందజేస్తున్నట్లు తెలిపారు. గృహ నిర్మాణ శాఖ డిఇ మురళీమోహన్, ఎఇ కొల్లి రాజేష్, సచివాలయ కన్వీనర్ వాసుపల్లి రెయ్యుడు, ఇంజనీరింగ్ అసిస్టెంట్, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/02/bpm-special.jpg)