ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి: గురజాడ పాఠశాలలో సోమవారం ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఎంతో ఆలోచింపజేసింది. వివిధ అంశాలపై విద్యార్థులు రూపొందించిన నమూనాలు, అందులో సృజనాత్మకత, చొరవ ‘నేటి బాలలే రేపటి సైంటిస్టులు, ఇంజినీర్లు’ అన్న సూక్తికి అద్దం పట్టాయి. ఈ సైన్స్ ఎగ్జిబిషన్లో వివిధ రకాల పండ్లు, కూరగాయలు వాటిలో ఉండే పోషకాలు తెలియజేయడం వంటి సాధారణ అంశాలతోపాటు వ్యవసాయం, పాడి, మత్స్య సంపద సృష్టించడం వరకు, సాగునీటి ప్రాజెక్టులు, యుద్ధవిన్యాసాలు, అంతరక్ష ప్రయాణాల్లో సాంకేతిక అంశాలను ప్రతిభింబిస్తూ విద్యార్థులు తమ నమూనాలను ప్రవేశపెట్టారు. వీటిని పాఠశాల విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు కూడా తిలకించారు. ఈ కార్యక్రమానికి సెంచూరియన్ యూనివర్శిటీ రిజిస్టార్ డాక్టర్ పి.పల్లవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలు నమూనాల ప్రదర్శనతోపాటు వాటి గురించి విద్యార్థులు వివరించే తీరునుచూసి ఆమె అబ్బురపోయారు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు తమ నమూనాలను ప్రదర్శనలో పెట్టారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ ఎం.స్వరూప, ప్రధానోపాధ్యాయులు శేఖర్ పాల్గొన్నారు.