ప్రజాశక్తి-రాజమహేంద్రవరం సమస్యలు పరిష్కరించాలని ఆశ వర్కర్స్ చేపట్టిన ధర్నా శుక్రవారం రెండో రోజుకు చేరింది. గోకవరం బస్టాండ్ వద్ద సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మహా ధర్నా, వంటా వార్పు అనంతరం సబ్ కలెక్టరెట్ నుంచి దేవీచౌక్, గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం, ఆనం కళాకేంద్రం మీదుగా కలెక్టరేట్ వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ ధర్నాలో సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఎన్నో హామీలు కురిపించారని, గద్దెనెక్కాక ఒక్క హామీ కూడా అమలు చేయలేదని విమర్శించారు. కోవిడ్లో ఇల్లు, కుటుంబాలు వదిలి, ప్రాణాలు సైతం లెక్కచేయక ప్రజల ప్రాణాలు కాపాడారన్నారు. కోవిడ్లో ఆశాలను పొగడ్తలతో ముంచేశారు తప్ప నయా పైసా వేతనం పెంచలేదన్నారు. సుప్రీంకోర్టు వేతన కార్మికులందరికీ గ్రాడ్యుటీ ఇవ్వాలని ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం నేటికీ అమలు చేయలేదన్నారు. ఇప్పటికైనా కనీస వేతనం ఇవ్వాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, రాజకీయ వేధింపులు ఆపాలని, ఆన్లైన్ వర్క్లు తగ్గించాలని, సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు టిడిపి సిటీ ఇన్ఛార్జి ఆదిరెడ్డి వాసు, నాయకులు రెడ్డి మణి, చండి ప్రియ మద్దతు తెలిపారు. ఈ ధర్నాలో ఎపి ఎంఎస్ఆర్యు రాష్ట్ర నాయకులు కృష్ణ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ, ఉపాధ్యక్షుడు ఎస్ఎస్.మూర్తి, కెఎస్వి.రామచంద్రరావు, ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె.అన్నామణి, ట్రెజరర్ ఎం.వెంకటలక్ష్మి, సిపిఎం నగర్ కార్యదర్శి బి.పవన్ ధనలక్ష్మి, కొండ వెంకటలక్ష్మి, ఐ.వెంకటలక్ష్మి, రాజకుమారి, నాగమణి, హవేల, మేరీ, లక్ష్మి, సత్యవతి, లీల, దుర్గ, కోరుకొండ వెంకట లక్ష్మి, కుమారి పాల్గొన్నారు.