ప్రజాశక్తి-అనకాపల్లి
ఆశా వర్కర్ల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కారం చేయాలని కోరుతూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం.హేమంత్కు ఎపి ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె.శాంతి, కార్యదర్శి ఇ.పార్వతి, సిఐటియు నాయకులు గంటా శ్రీరామ్ తదితరులు సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఇ.పార్వతి మాట్లాడుతూ ఆశాల సమస్యలపై ఈనెల 11 , 12 తేదీలలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని తెలిపారు. ఆశావర్కర్స్ కనీసవేతనం చెల్లించాలని, కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ని ఆశాలుగా మార్పుచేయాలని, పనిభారాన్ని తగ్గించాలని కోరారు. మొబైల్ వర్క్స్కి శిక్షణ ఇవ్వాలని, రికార్డ్స్ లేదా ఆన్లైన్ ఒక పని ఒకసారి మాత్రమే చేయించాలని, 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలని, వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని, 62 సంవత్సరాలు రిటైర్మెంట్ జిఓని వర్తింపచెయ్యాలని, ప్రభుత్వ శెలవులు, మెడికల్ లీవ్, వేతనంతో కూడిన మెటర్నటీ లీవ్ అమలు చెయ్యాలని, ప్రభుత్వ సంక్షేమ పధకాలు అమలు చెయ్యాలని, ఇళ్ళ స్థలాలు, ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని, కోవిడ్ కాలంలో మరణించిన ఆశాలకు 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, మరణించిన కుటుంబంలో అర్హులైన వారిని ఆశాలుగా తీసుకోవాలని, ఎఎన్ఎం, హెల్త్ సెక్రటరీల నియామకాలలో ఆశాలకు వెయిటేజీ ఇవ్వాలని కోరారు.11, 12 తేదీలలో 36 గంటల ధర్నారాష్ట్రవ్యాప్తంగా ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 36 గంటల ధర్నా జయప్రదం చేయాలని ఏపీ ఆశ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. స్థానిక సిఐటియు కార్యాలయంలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు శాంతి మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు విపరీతంగా పని భారం పెరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి బి సత్యవతి, జిల్లా కార్యదర్శి కే వరలక్ష్మి, రామలక్ష్మి, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.