ఇఎస్‌ఎంఎస్‌ యాప్‌పై శిక్షణ

Mar 2,2024 21:14

 ప్రజాశక్తి – పార్వతీపురం రూరల్‌  : సాధారణ ఎన్నికల్లో విధులు నిర్వహించే తనిఖీ బృందాల సిబ్బంది ఎన్నికల సంఘం రూపొందించిన ఎన్నికల జప్తు నిర్వహణ వ్యవస్థ (ఇఎస్‌ఎంఎస్‌)యాప్‌పై పూర్తి అవగాహన ఉండాలని కలెక్టరు నిశాంత్‌ కుమార్‌ తెలిపారు. సాధారణ ఎన్నికల శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా శనివారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో తనిఖీ బృందాలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టరు మాట్లాడుతూ ఎన్నికల కమిషను ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ఎప్పటికప్పుడు మార్పులు, సాంకేతికత అందుబాటులోనికి తీసుకొస్తుందని తెలిపారు. అందులో భాగంగా తనిఖీ బృందాలు విధులకు సంబంధించి ఎన్నికల సమయంలో జప్తుచేసిన డబ్బు, ఇతర వస్తువులకు సంబంధించి ఎన్నికల జప్తు నిర్వహణ వ్యవస్థ (ఇఎస్‌ఎంఎస్‌) యాప్‌ రూపొందించిందన్నారు. తనిఖీ బృందాల వారు పట్టుకున్న డబ్బు, ఇతర వస్తువులను ఈ యాప్‌లో తప్పని సరిగా నమోదు చేయాలని, కావున యాప్‌ వినియోగంపై పూర్తి అవగాహన కల్పించుకోవాలని తెలిపారు. బ్యాంకుల నుండి అధికార కార్యకలాపాల కొరకు లేదా ఇతర అవసరాల కోసం అధిక మొత్తంలో డబ్బులు డ్రా చేస్తే ఆ డబ్బులకు సంబంధించి క్యూఆర్‌ కోడ్‌ ఇస్తారని, దాన్ని ఈ యాప్‌ ద్వారా ధ్రువీకరణ చేసుకోవచ్చునని తెలిపారు. తనిఖీ బృందాల ప్రజలు ఎంతవరకు డబ్బులు కలిగిఉండవచ్చు, ఎంత మొత్తం సీజ్‌ చేయవచ్చు తదితర అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తమ అధికార పరిధికి లోబడి విధులు నిర్వహించాలని తెలిపారు. ఎన్నికల విధుల్లో నిర్లక్యంగా పనిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల విధులు, యాప్‌ నిర్వహణపై అనుమానాలను వెంటనే నివృత్తి చేసుకోవాలని, తనిఖీ బృందాల సభ్యులతో వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేసుకొని వారి సందేహాలను అందులో తెలియజేస్తే, వాటికి వెంటనే సమాధానాలు తెలియజేస్తామని, తద్వారా అందరు సభ్యులకు అవగాహన కలుగుతుందని తెలిపారు. ఎస్‌పి విక్రాంత్‌ పాటిల్‌ మాట్లాడుతూ తనిఖీ అధికారులు తనిఖీల్లో పట్టుబడిన, సీజ్‌ చేసిన వివరాలను తప్పనిసరిగా ఎన్నికల జప్తు నిర్వహణ వ్యవస్థ (ఇఎస్‌ఎంఎస్‌)యాప్‌లో నమోదు చేయాలని తెలిపారు. జప్తు అనంతరం తీసుకొనే చర్యలు ఈ యాప్‌లో నమోదైన వివరాలు ఆధారంగానే ఉంటాయని కావున, సిబ్బంది ఎన్నికల సమయంలో పట్టుకొన్న ప్రతి కేసు వివరాలను ఈ యాప్‌లో నమోదు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జి డిఆర్‌ఒ జి.కేశవరావు, తనిఖీ బృందాల నోడల్‌ అధికారి, సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఎండి గయాజుద్దీన్‌, తనిఖీ బృందాల అధికారులు పాల్గొన్నారు.పోలింగ్‌ కేంద్రాల మార్పుపై ప్రతిపాదనలుజిల్లాలో ప్రస్తుతం ఉన్న పోలింగ్‌ కేంద్రాల్లో అదనంగా సహాయక కేంద్రం ఏర్పాటు, పోలింగ్‌ కేంద్రం పేరు మార్పు, లొకేషన్‌ మార్పుపై ప్రతిపాదనలు పంపిస్తున్నట్లు రాజకీయ పార్టీల ప్రతినిధులకు కలెక్టరు నిశాంత్‌ కుమార్‌ తెలిపారు. శనివారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో తన చాంబరులో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 1031 పోలింగు కేంద్రాలను 769 పోలింగు స్టేషను ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని, వాటిలో 244 పోలింగ్‌ కేంద్రాల పేర్లు మార్పునకు, 26 పోలింగ్‌ కేంద్రాల లొకేషన్‌ మార్పునకు ప్రతిపాదనలు సమర్పిస్తున్నట్లు చెప్పారు. ఇందులో పాలకొండ నియోజక వర్గంలో 120 పోలింగ్‌ కేంద్రాల పేర్లు మార్పునకు, 12 పోలింగ్‌ కేంద్రాల లొకేషన్‌ మార్పునకు, కురుపాంలో 5 పోలింగ్‌ కేంద్రాల పేర్లు మార్పునకు, 8 పోలింగ్‌ కేంద్రాల లొకేషన్‌ మార్పు నకు, పార్వతీపురంలో 87 పోలింగ్‌ కేంద్రాల పేర్లు మార్పునకు, 2 పోలింగ్‌ కేంద్రాల లొకేషన్‌ మార్పు నకు, సాలూరులో 32 పోలింగ్‌ కేంద్రాల పేర్లు మార్పునకు, 4 పోలింగ్‌ కేంద్రాల లొకేషన్‌ మార్పు నకు ప్రతిపాదనలు వచ్చాయని, వాటి ఆమోదానికి పంపిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఇన్‌ఛార్జ్‌ డిఆర్‌ఒ జి.కేశవనాయుడు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️