ప్రజాశక్తి – ఏలూరు
ఎస్సి, ఎస్టి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఉన్నతి-మహిళాశక్తి’ ప్రత్యేక పథకం ద్వారా వారి జీవనోపాధికి సున్నా వడ్డీకే ఆటో రిక్షాలు అందిస్తోందని కలెక్టర్ ప్రసన్నవెంకటేష్ తెలిపారు. స్థానిక కలెక్టరేట్లో గురువారం ఈ పథకాన్ని ప్రారంభించి 11 మంది ఎస్సి, ఎస్టి మహిళలకు ఆటోలను కలెక్టర్ అందజేశారు. అనంతరం ఆటోలో కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జెసి బి.లావణ్యవేణి ప్రయాణించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సి, ఎస్టి మహిళల జీవనోపాధికి సిఎం జగన్ ఉన్నతి-మహిళాశక్తి పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. మహిళల జీవనోపాధికి ఇదిఎంతో దోహదపడుతుందన్నారు. లబ్ధిదారులపై భారంలేకుండా సులభవాయిదాల్లో రుణాలు చెల్లించుకుంటూ కుటుంబాలను పోషించుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆటో కొనుగోలు సమయంలో లబ్ధిదారులు పది శాతం వాటా ధనాన్ని ఎస్హెచ్జి బ్యాంకు ఖాతాలో జమచేస్తే మిగిలిన 90 శాతం వడ్డీలేని రుణంగా అందిస్తామన్నారు. ఏలూరు జిల్లాలో 12 మంది ఎస్సి, ఎస్టి మహిళలకు రూ.37.97 లక్షల విలువైన ఉన్నతి – మహిళాశక్తి పథకం ఆటోలను మంజూరు చేయగా వాటిలో గురువారం 11 మంది మహిళలకు అందజేశామన్నారు. ఇందుకోసం రూ.36 లక్షల వడ్డీ లేని రుణ సదుపాయం కల్పించామన్నారు. ఆటోలు తీసుకొనే మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్లు ఇప్పిస్తామని, వీరికి డిఆర్డిఎ, రవాణాశాఖ అధికారుల ద్వారా అవసరమైన సహకారం అందజేస్తామన్నారు. కేవలం ఈ 11 మంది మహిళలతోనే ఈ పథకం ఆగకుండా మరింతమంది ఎస్హెచ్జి మహిళలు ముందుకు రావాలన్నారు. కాలుష్య నియంత్రణను దృష్టిలో ఉంచుకుని పెట్రోల్, డీజిల్తో నడిచే ఆటోలు కాకుండా సిఎన్జి ఆటోలను ప్రోత్సహిస్తామన్నారు. జెసి మాట్లాడుతూ సెర్ఫ్ ఉన్నతి విభాగం ద్వారా మహిళల జీవనోపాధి కల్పించేందుకు మహిళా శక్తి ఆటో పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఇందులో భాగంగా ఎస్సి, ఎస్టి మహిళలకు ప్రస్తుతం 12 ఆటో రిక్షాలను పంపిణీకి సిద్ధం చేశామన్నారు. ఎస్సి, ఎస్టిలకు చెందిన మహిళలు స్వయం సహాయ సంఘాల సభ్యులై ఉండి, వయస్సు 20 ఏళ్ల నుంచి 45 ఏళ్లలోపు ఉండాలన్నారు. తప్పని సరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగిఉండాలన్నారు. గ్రామీణ ప్రాంతాల మహిళలు మాత్రమే అర్హులన్నారు. 10 శాతం లబ్ధిదారుల వాటాగా, మిగిలిన 90 శాతం వడ్డీలేని రుణం అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఒ ఎం.వెంకటేశ్వర్లు, డిఆర్డిఎ పీడీ డాక్టర్ ఆర్.విజయరాజు, ఐసిడిఎస్ పీడీ కె.పద్మావతి, ఆర్టిఒ శ్రీహరి, బిసి సంక్షేమాధికారి ఆర్వి.నాగరాణి, ఎస్సి కార్పొరేషన్ ఇడి కుమూదినీసింగ్, మహిళా శక్తి సంఘాల అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు.