ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్ : జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమనిబంధనలు తెలుసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక తెలిపారు. ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన సదస్సును స్థానిక కలెక్టరేట్లో మంగళవారం ఏర్పాటు చేసి ఎన్నికల సమయంలో పాటించాల్సిన విధివిధానాలను వివరించారు. నామినేషన్లు దాఖలు చేసేటప్పుడు నామినేషనుపత్రాలతో పాటు అందించాల్సిన పత్రాలు, ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళి, ఎన్నికల ఖర్చు, ప్రచారం కోసం అనుమతులు, ఎలక్ట్రానిక్ ఓటంగు మిషన్లు, పోస్టలు బ్యాలెట్, ఇంటి వద్ద ఓటింగు, ఎన్నికల సమయంలో చేయాల్సిన, చేయకూడని పనులపై అవగాహన కల్పిస్తూ సదస్సు నిర్వహించారు. వికలాంగులకు, 85 సంవత్సరాలు దాటి పోలింగు కేంద్రానికి రాలేని వృద్దులకు ఇంటి వద్ద ఓటు వేసుకొనే సదుపాయం కల్పిస్తున్నామని, దీనికి ముందుగా ధరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రచారానికి సంబంధించి వాహనాలు, లౌడ్ స్పీకర్లకు, సమావేశాలు, ఊరేగింపులకు ముందుగా అనుమతి తీసుకోవాలని జాయింటు కలెక్టరు తెలిపారు. వీరిటిలో పాటు మరిన్ని వివరాలను ఆమె ప్రతినిధులకు సూచించారు. ఈ సదస్సులో ఇన్ ఛార్జ్ డిఆర్ఒ జి.కేశవనాయుడు, డిప్యూటీ కలెక్టర్ ఆర్ వి సూర్యనారాయణ, డిపిఆర్ఒ లోచర్ల రమేష్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.