ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్ :ఎన్నికల కమిషన్ సూచనల మేరకు జిల్లాలో ఎన్నికల పనులు పూర్తి చేశామని కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. రాజకీయ పార్టీలతో బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల సంబంధిత అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికలకు సంబంధించిన పనులు, శిక్షణ కార్యక్రమాలు సజావుగా జరిగాయన్నారు. జిల్లాలో ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా నిర్వహించుటకు అన్ని చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఉన్న పోలింగ్ కేంద్రాలలో అదనంగా సహాయక కేంద్రం ఏర్పాటు, పోలింగ్ కేంద్రం పేరు మార్పు, లొకేషన్ మార్పుపై ప్రధాన ఎన్నికల అధికారి ప్రతిపాదనలు కోరారని తెలిపారు. జిల్లాలో జనవరి 13వ తేదీ నుండి ఇప్పటి వరకు 717 మందిని ఓటర్లుగా చేర్చామని తెలిపారు. 129 ఓట్లను తొలగించామని, 1091 మంది వివరాలు చేర్పులు, మార్పులు జరిగాయని వివరించారు.ఈ సమావేశంలో డిఆర్ఒ జి.కేశవనాయుడు, టిడిపి ప్రతినిధి జి.వెంకటనాయుడు, వైసిపి ప్రతినిధి సిహెచ్ సంతోష్, సిపిఎం ప్రతినిధి పి.రాజశేఖర్, జనసేన ప్రతినిధి పైలా శ్రీనివాసరావు, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు ఎ.శ్రీనివాసరావు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.క్రీడాకారులకు కలెక్టర్ అభినందనఆడుదాం ఆంధ్రా పోటీల్లో రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించిన పురుషుల జట్టు క్రీడాకారులను కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం తన ఛాంబర్ లో అభినందించారు. అనంతరం విజేతలకు కప్తోపాటు రూ.3 లక్షల నగదు బహుమతి చెక్కును కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు మరింత ప్రతిభ కనబరిచి జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అధికారి ఎస్.వెంకటేశ్వర రావు, జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రెటరీ డిటి గాంధీ, శిక్షకులు తిరుపతి రావు, వైకుంఠ రావు, తదితరులు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/02/ppmr-coll.jpg)