ప్రజాశక్తి-మారేడుమిల్లి
జిడి కానిస్టేబుల్-2023కు సంబంధించి దరఖాస్తు చేసుకొని, పోలీసు శాఖ నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్లో ఉత్తీర్ణత సాధించిన 60 మంది గిరిజన యువతీ యువకులకు మారేడుమిల్లి యూత్ ట్రైనింగ్ సెంటర్లో కాకినాడ శ్యామ్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో 45 రోజుల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి సూరజ్ గనోరే తెలిపారు. ఈ మేరకు మంగళవారం శిక్షణకు సంబంధించిన మెటీరియల్ పుస్తకాలను పిఒ గనోరే, రంపచోడవరం ఎఎస్పి జగదీష్ ఆడహల్లి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పిఒ మాట్లాడుతూ నిపుణులతో 45 రోజులపాటు ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో ఈ సమయంలో ఉచిత వసతి, భోజనం సౌకర్యం రంపచోడవరం ఐటిడిఎ ద్వారా అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని శిక్షణ తీసుకున్న ప్రతి ఒక్క యువతీ యువకులు ఉద్యోగాన్ని పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మారేడిమిల్లి సీఐ రుద్రరాజు భీమరాజు, ఎస్ఐ రాము, దేవీపట్నం ఎస్ఐ నాగార్జున తదితరులు పాల్గొన్నారు.