ప్రజాశక్తి-కాకినాడఎల్పిజి గ్యాస్ కనెక్షన్, సిలిండర్పై అదనంగా సొమ్ములు వసూలు చేసే ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకుంటామనిజిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ హెచ్చరించారు. ఎల్పిజి గ్యాస్ ఏజెన్సీలు, గ్యాస్ కనెక్షన్, సిలిండర్ల డెలివరీలో లబ్ధిదారుల నుంచి అదనపు సొమ్ము వసులు చేస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో శుక్రవారం కలెక్టరేట్లో పౌరసరఫరాల శాఖ అధికారులతో కలిసి జిల్లాలోని వివిధ గ్యాస్ ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్లతో జెసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద నిరుపేద కుటుంబాల మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్, సిలిండర్, స్టవ్, రెగ్యులేటర్ అందిస్తోందన్నారు. సంవత్సరానికి 12 సిలిండర్లు రాయితీపై రూ.300కు ఇస్తోందన్నారు. కాకినాడ జిల్లాలో ఈ పథకం కింద ఇప్పటివరకు సుమారుగా 32 వేల మంది మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చినట్టు చెప్పారు. ఈ గ్యాస్ కనెక్షన్ అందజేసే ఏజెన్సీలు లబ్ధిదారుల నుంచి ఎటువంటి అదనపు సొమ్ము వసూలు చేయడానికి వీల్లేదన్నారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా లబ్ధిదారుల నుంచి అదనపు సొమ్ము వసూలు చేసే ఏజెన్సీల లైసెన్స్ రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఇంటింటికీ గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసే డెలివరీ బార్సుపై గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. గ్యాస్ ఏజెన్సీలు తమ గోదాము నుంచి ప్రతిరోజు పంపిణీ చేసే గ్యాస్ సిలిండర్ల వివరాలు ఎప్పటికప్పుడు రిజిస్టర్లో సక్రమంగా నమోదు చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి యంవి.ప్రసాద్, ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీల అసోసియేషన్ ప్రెసిడెంట్ కె.సాయిప్రసాద్, శ్రీఏజెన్సీ కాకినాడ ఎల్.కస్తూరి, గాయత్రీ ఏజెన్సీ పెద్దాపురం వైఎస్వీ.రమణ, వెంకటరమణ గ్యాస్ ఏజెన్సీ ఎ.నరసింహ, అరుణాచల శ్రీనివాస గ్యాస్ ఏజెన్సీ కరప బి.ద్రౌపదీదేవి, పౌరసరఫరాల శాఖ సిబ్బంది విజరు పాల్గొన్నారు.
![గ్యాస్ సిలిండర్లపై అదనపు సొమ్ముపై చర్యలు](https://prajasakti.com/wp-content/uploads/2023/12/Untitled-1-copy-208.jpg)