ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : అందరూ సహృదయంతో జరుపుకునే పర్వదినమే క్రిస్మస్ అని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. సోమవారం క్రిస్మస్ ను పురస్కరించుకొని స్థానిక మెయిన్ రోడ్ లో ఉన్న సిమ్స్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. మత పెద్దలు ముందుగా ప్రత్యేక ప్రార్థనలు జరిపి క్రిస్మస్ కేకులు కట్ చేశారు. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ ఏసు అందరికీ మంచి మార్గ నిర్దేశకులని అన్నారు. కార్యక్రమంలో ఆర్ఎస్ జాన్ తదితరులు పాల్గొన్నారు.
పూసపాటిరేగ : మండలంలోని క్రిస్మస్ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. క్రైస్తవులంతా భక్తిశ్రద్ధలతో ఉదయాన్నే ప్రార్థన మందిరాలకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పూసపాటిరేగ యుఆర్పిఎఫ్ చర్చిలో పాస్టర్ ఎం. జీవన్ కుమార్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం స్థానిక సర్పంచ్ టి. సీతారాం, నాయకులు పిన్నింటి అప్పలనాయుడు, పిడిఎఫ్ ప్రసాద్ తదితరులు పాల్గొని క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపి పేదలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు.
బొబ్బిలి : పట్టణంలో సోమవారం క్రిస్టమస్ ఘనంగా జరిగింది. సిబిఎం, ఆర్సీఎం, బాప్టిస్ట్, ఇతర చర్చిలలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తెల్లవారుజామున క్రైస్తవులలు వీధులలో ర్యాలీగా వెళ్లి యేసు పాటలను ఆలపించారు. క్రిస్టమస్ ప్రాముఖ్యతను క్రైస్తవులకు ఫాస్టర్లు, ఫాదర్స్ వివరించారు. క్రైస్తవులతో చర్చిలు కలకళలాడాయి.