మండపేటలో అంగన్వాడీల మానవహారం
ప్రజాశక్తి-మండపేట
తమ డిమాండ్ల సాధనే లక్ష్యంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె శుక్రవారం నాటికి నాలగవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అంగన్వాడీలు కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. స్థానిక కలువపువ్వు సెంటర్ నుంచి రాజారత్న జంక్షన్ వరకు చేరుకుని అక్కడ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జనసేన, టిడిపి, ఎమ్ఆర్పిఎస్ నాయకులతో కలిసి మానవహారం చేపట్టారు. అనంతరం పలువురు మాట్లాడుతూ కనీస వేతనం, పిఎఫ్, రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని, పనిభారం తగ్గించాలని, ఆయాలకు ప్రమోషన్ వయస్సు 50 సంవత్సరాలకు పెంచాలని తదితర అంశాలపై ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలలో భాగంగా తెలంగాణ కంటే ఎక్కువ వేతనం ఇస్తానన్న సిఎం జగన్ ్డ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. ఒకవైపు మేము శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే మరొకవైపు అంగన్వాడీ కేంద్రాల తాళాలు బద్దలు కొట్టి వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వం తమ డిమాండ్లు అంగీకరించే వరకు సమ్మెను కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో వేగుళ్ళ వీరాజ్, ఉంగరాల రాంబాబు, ధూళి జయరాజు, మండపేట ప్రాజెక్ట్ అధ్యక్ష, కార్యదర్శులు ఎన్.బేబీ, ఆదిలక్ష్మి, సిహెచ్.రాణి, మంగాదేవి, జానకి, అనంత, దేవకి, దుర్గా, వజ్రం, కుమారి, నాగలక్ష్మి, కమల, సత్యవేణి, పద్మ, నూకరత్నం తదితరులు పాల్గొన్నారు.