ప్రజాశక్తి-కాకినాడ అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మె 23వ రోజు వేలాదిమంది అంగన్వాడీలు కాకినాడ కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా చేశారు. మాట తప్పిన జగన్ అంటూ నినాదాలు చేశారు. ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జి.బేబిరాణి, సిఐటియు జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషబాబ్జి మాట్లాడుతూ ఇప్పటివరకు జరిగిన ఐదు దపాల చర్చల సందర్భంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్థికపరమైన అంశాలను పక్కనపెట్టి, సర్వీసుకి సంబంధించి చర్యలు మాత్రమే అంగీకరించారని, జనరల్ డిమాండ్ అయిన వేతన పెంపు చేసేంతవరకు సమ్మెను కొనసాగిస్తామని తెలిపారు. అంగన్వాడీల వేతనాల పెంపుకి ఆర్థిక పరిస్థితి బాలేదని చెప్తున్న జగన్ ప్రభుత్వానికి ఎంఎల్ఎలు, ఎంపీల వేతనాలు రూ.లక్షల్లో తీసుకోవడానికి, సజ్జల వంటి 33 మంది సలహాదారులకు రూ.3 లక్షల చొప్పున వేతనాలు చెల్లించడానికి ఆర్థిక పరిస్థితి ఎలా సహకరించిందని ప్రశ్నించారు. అంగన్వాడీ టీచర్, ఆయాలు చాలీ చాలని జీతాల నుంచి సెంటర్ అద్దెలు, వంటకు గ్యాస్ బండ పెట్టుబడి పెడుతూ ఇంటికి సగం వేతనం కూడా తీసుకువెళ్లలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2017 నుంచి కేంద్రం విడుదల చేసిన టిఎ, బిల్లులు అంగన్వాడీలకు చెల్లించకుండా జగన్ ప్రభుత్వం నిధులను దారి మళ్లించిందని, బకాయిలు చెల్లించకుండా ఇప్పటి నుండి అమలు చేస్తామని చెప్పడం అన్యాయమన్నారు. తక్షణం మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జిఒ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీలు, నిత్యా వసరాల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన జగన్, మోడీ ప్రభుత్వాలకు అంగ న్వాడీల వేతనాలు పెంచడం తెలియదా అని ప్రశ్నించారు. ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చాక కూడా అవసరమైతే నిరవధిక సమ్మె కొనసాగించడానికి అంగన్వాడీలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం నేనే సావిత్రీబారు ఫూలే అనే పుస్తకాన్ని ఆవిష్కరించి, ఆమె జయంతి సదర్భంగా ఘనంగా నివాళుర్పించారు. అనంతరం బాలాచెరువు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని, లబ్ధిదారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని, 2017 నుండి పెండింగ్లో ఉన్న టిఎ బిల్లులను బకాయిలతో సహా చెల్లించాలని, తెలంగాణ కంటే అదనంగా వేతనాలు చెల్లిస్తానని జగన్ హామీ అమలు పరచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం.రాజశేఖర్, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రమణి, ఎపి బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నిట్ల శ్రీను, రొంగల ఈశ్వరరావు, పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సత్తిరాజు, 104 ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు త్రిమూర్తులు, శ్రీకాంత్, ఎపిఎంఎస్ఆర్యు రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ నక్కెళ్ల శ్రీను, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, సహాయ కార్యదర్శి క్రాంతి కోశాధికారి మలకా రమణ, జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు జీవా, ధనలక్ష్మి, రాజా మాట్లాడారు. అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దడాల పద్మ, ఏరుబండి చంద్రావతి, నాయకులు రమణమ్మ, నాగమణి, ధనలక్ష్మి, ఎస్తేరు రాణి దాడి బేబి, మేరీ సమాధానం, బుల్లెమ్మ, సునీత, సుజాత, రాజేశ్వరి, వెంకటలక్ష్మి, జ్యోతి, వీరమణి, వీరవేణి, నీరజ పాల్గొన్నారు.