పొలాలను పరిశీలిస్తున్న ఉద్యాన శాఖ రాష్ట్ర కమిషనర్ శ్రీధర్
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : తుపాను నేపథ్యంలో దెబ్బతిన్న ఉద్యాన పంటలను రాష్ట్ర ఉద్యాన శాఖ కమిషనర్ డాక్టర్ ఎస్ఎస్ శ్రీధర్ గురువారం పరిశీలించారు. నరసరావుపేట మండలంలోని పమిడిమర్రు, కొండకావూరు గ్రామాల్లో నేల వాలిన అరటి తోటలను, మిర్చి పంటలను పరిశీలించి అధికారులతో మాట్లాడి నష్టంపై అంచనా వేశారు. రైతులకు అధికారులు అందుబాటులో ఉండి సలహాలు సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. కొండకావూరులో 24 ఎకరాల అరటి తోట నేల వాలడంపై ఆందోళన వ్యక్తం చేశారు. మిరప తోటలను పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. త్వరితగతిన పంట నష్టం అంచనా వేసి నివేదికివ్వాలని అధికారులను ఆదేశించారు. ఆయనవెంట జిల్లా ఉద్యాన శాఖాధికారి బి జాన్ బెన్నీ, నరసరావుపేట ఉద్యాన శాఖాధికారి డి.నవీన్ కుమార్, ఉద్యాన సహాయకులు ఆంజనేయులు, శ్రీకాంత్రెడ్డి ఉన్నారు.