ప్రజాశక్తి – నెల్లిమర్ల : విద్యార్థులకు నైపుణ్య విద్యను అందించడంలో సెంచూరియన్ విశ్వవిద్యాలయం ముందంజలో ఉందని లార్సెన్ అండ్ టోబ్రో చీఫ్ సస్టయినబిలిటీ ఆఫీసర్ డాక్టర్ పణీష్రావు అన్నారు. ఇటీవల సెంచూరియన్ విశ్వవిద్యాలయం వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ డి.ఎన్.రావు, ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు చేతుల మీదుగా ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసిన విషయం విధితమే. ఈ సందర్భంగా తనను కలసిన విలేఖరులతో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే మల్టీ టాస్క్ చేయగల నేర్పును సాధించాలన్నారు. అవరోధాలను కూడా పాజిటివ్ దృక్పథంలో స్వీకరించి ముందుకు సాగినపుడు విజయాలు వాటంతట అవే సమకూరుతాయన్నారు. తాను కూడా అదే దృక్పథంతో ముందుకు వెళ్తున్నానని గుర్తు చేశారు. దివాలా తీసిన వాటిని కూడా లాభాల భాట పట్టించానని గుర్తు చేశారు. విద్యార్థులు ప్రపంచ పరిణామాల వల్ల ఎదురయ్యే సవాళ్లను కూడా స్వీకరించ గల సమర్థత కలిగి ఉండాలన్నారు. ఆ విధంగా తమ లక్ష్యాలను చేరుకునేందుకు పట్టుద లతో కృషి చేస్తే విజయం మీ వెంటే ఉంటుందని చెప్పారు.