ప్రాణ త్యాగానికైనా సిద్ధమే

Jan 5,2024 21:52
ఫొటో : మాట్లాడుతున్న జిల్లా అంగన్‌వాడీ వర్కర్ల యూనియన్‌ అధ్యక్షురాలు సుజాతమ్మ

ఫొటో : మాట్లాడుతున్న జిల్లా అంగన్‌వాడీ వర్కర్ల యూనియన్‌ అధ్యక్షురాలు సుజాతమ్మ
ప్రాణ త్యాగానికైనా సిద్ధమే
– ఉద్ఘాటించిన అంగన్‌వాడీ వర్కర్లు
ప్రజాశక్తి-ఇందుకూరుపేట : అంగన్‌వాడీల డిమాండ్స్‌ నెరవేరేంత వరకూ సమ్మె విరమించబోమని అవసరమైతే ప్రాణ త్యాగానికైనా వెనకాడబోమని జిల్లా అంగన్‌వాడీ వర్కర్ల యూనియన్‌ అధ్యక్షురాలు సుజాతమ్మ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద 25వ రోజు అంగన్‌వాడీ కార్యకర్తలు నిరసన బాటపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ అధ్యక్షురాలు సుజాతమ్మ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతుంటే ఈ పాలకులకూ పట్టదా అని ప్రశ్నించారు. అంగన్‌వాడీల డిమాండ్ల సాధనకు గత 24 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వంలో కనీస స్పందన లేదని మండిపడ్డారు. ఉద్యమాన్ని మరింత తీవ్రపరిచి ఉన్న ఎంఎల్‌ఎలు మంత్రుల నివాసాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. మంత్రి కాకాణి నివాసాన్ని ముట్టడించేందుకు అంగన్‌వాడీలు వెళ్తుంటే పోలీసులు తమను అరెస్టు చేయాలని చూస్తే అంగన్‌వాడీల ఐక్యమత్యానికి ప్రభుత్వం వెనుదిరగాల్సి వచ్చిందన్నారు. తెలంగాణ కంటే ఎక్కువ వేతనం ఇస్తామని సిఎం ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఫేస్‌యాప్‌ విధానం రద్దు చేయాలని, పర్యవేక్షణ పేరుతో వేధింపులు ఆపాలని, గ్రాడ్యుటీ, పెన్షన్‌ అమలు చేయాలన్నారు. అదేవిధంగా 24 రోజుల దీక్షా సమయంలో కూడా వేతనాలు అంగన్‌వాడీలకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీ సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మెను విరమించబోమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా ఆటో యూనియన్‌ అధ్యక్షులు మారుబోయిన రాజా, సిపిఎం మండల కార్యదర్శి మైపాటి కోటేశ్వరరావు, సిఐటియు మండల అధ్యక్షులు ఎస్‌.కె.చాన్‌బాషా, అంగన్‌వాడీ వర్కర్ల నాయకులు శారదమ్మ, గీతాదేవి, మస్తానమ్మ, స్వర్ణమ్మ, సుగుణమ్మ, తదితరులు పాల్గొన్నారు.

➡️