ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఈనెల 11,12,13 తేదీల్లో విజయనగరంలో జరగనున్న అండర్ 14,17,19 బాక్సింగ్ రాష్ట్రస్థాయి పోటీలను విజయవంతం చేయాలని జిల్లా ఉప విద్యా శాఖ అధికారి వాసుదేవరావు, ఎస్జిఎఫ్ కార్యదర్శి ఎల్ వి రమణ తెలిపారు. శనివారం స్థానిక రాజీవ్ క్రీడా ప్రాంగణంలో ఉన్న ఇండోర్ స్టేడియంలో వ్యాయామ ఉపాధ్యాయులతో పోటీలు కోసం సన్నాహాక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు విభాగాల్లో జరిగే బాక్సింగ్ పోటీలకు సుమారుగా 800 మంది వరకు క్రీడాకారులు హాజరు కానున్నారని తెలిపారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా చూడాలన్నారు. పోటీలు విజయవంతంగా నిర్వహించేందుకు వ్యాయామ ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధతో పని చేయాలన్నారు. వసతి, భోజన సదుపాయాలలో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. సమావేశంలో వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/IMG-20231209-WA0016.jpg)