ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్ : బాలికా హక్కుల పరిరక్షణకు అందరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టర్ కార్యాలయం వద్ద నుంచి నుంచి ఐసిడిఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.కలెక్టర్ దినేష్ కుమార్ జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం బాలికా హక్కులపై రూపొందించిన వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. బాలికా హక్కులపై ప్రజలలో చైతన్యం రావాలన్నారు. ప్రజలకు వీటిపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ఐసిడిఎస్, హెల్త్, గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అన్ని గ్రామాల్లో బాల్య వివాహాల నివారణా, బాలికా విద్య అవసరం, బాలికల హక్కులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. గర్భస్త లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు.18 ఏళ్ళు నిండే వరకు ప్రతి ఆడపిల్ల చదువుకునేలా చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యురాలు బత్తుల పద్మావతి, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. మాధురి, మెప్మా పీడీ టి.రవికుమార్, బాల సంక్షేమ కమిటీ చైర్మన్ వి.రామాంజనేయులు, డిపిపిఒ దినేష్ కుమార్, డిఎల్పిఒ.పద్మ, సిడిపిఒ రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.