మండపేటలో మానవహారం చేపట్టిన అంగన్వాడీలు
ప్రజాశక్తి-మండపేట
స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేస్తున్న సమ్మె శనివారం నాటికి 40వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అంగన్వాడీలు స్థానిక కలువపువ్వు సెంటర్లో మానవహారం నిర్వహించి రాస్తారోకో చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించకుండా ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన అంగన్వాడీ కేంద్రాలు తెరిచేది లేదన్నారు. ఇటువంటి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. వెంటనే వేతనాలు పెంచుకున్నట్లు మరో జీవో ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ అమలు చేయాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి. హెల్పర్ల ప్రమోషన్లకు వయోపరిమితి 50 సంవత్సరాలకు పెంచాలి. ప్రమోషన్లలలో రాజకీయ జోక్యం అరికట్టాలన్నారు. 300 జనాభా దాటిన మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలి. వర్కర్లతో సమానంగా మినీ వర్కర్లకు వేతనాలు పెంచాలి. వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం కనిపించాలన్నారు. సర్వీసులో ఉండి చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. బీమా అమలు చేయాలన్నారు. లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారం సరఫరా చేయాలన్నారు. ఆయిల్, కందిపప్పు క్వాంటిటీ పెంచాలన్నారు. సీనియారిటీ ప్రకారం వేతనాలు ఇవ్వాలన్నారు. సూపర్వైజర్ పోస్టులకు వయోపరిమితి తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 38 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం సమస్యలు పరిష్కరించడంలో నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందన్నారు. ఈ ఏడాదిలో దాదాపుగా అన్ని పండగలు ఆకలి పస్తులతో రోడ్లపైన జరుపుకున్నామన్నారు. కార్యక్రమంలో మండపేట ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీలు పాల్గొన్నారు.