మెగా డిఎస్‌సి ప్రకటించాలని నిరుద్యోగుల ధర్నా

Feb 7,2024 20:39

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : రాష్ట్రప్రభుత్వం 25వేల టీచర్‌ పోస్టులకు మెగా డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ డివైఎఫ్‌ఐ ఆధ్వర్యాన బుధవారం అభ్యర్థులు కోట జంక్షన్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న, రాష్ట్ర ఉపాధ్యక్షులు పిఎస్‌ఎన్‌ రాజు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగేళ్లుగా అదిగో డిఎస్‌సి, ఇదిగో డిఎస్‌సి అంటూ నిరుద్యోగులను మోసం చేసి నేడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ అతి తక్కువ పోస్టులతో నోటిఫికేషన్‌ ఇవ్వడం అన్యాయమని అన్నారు. రాష్ట్రంలో1.88లక్షల ఉపాధ్యాయులు ఉండాల్సిన చోట కేవలం 1. 69లక్షలు మాత్రమే ఉన్నారని, దాదాపు 18,520 ఖాళీ పోస్టులు ఉన్నాయని, ఇవి కాకుండా ఈనెలాఖరుకు మరో 5వేల మంది ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ చేయనున్నారని తెలిపారు. కేంద్రం చేబుతున్న లెక్కలు ప్రకారం 40వేల ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 117జీవో పేరుతో మరో 10వేల ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేసిందని గుర్తు చేశారు. తెలుగు మీడియం తీసివేసి 15వేల ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేసిన ఘనత జగన్మోహనరెడ్డి ప్రభుత్వానిదే అన్నారు. జగనన్న ప్రభుత్వంలో 2వేల పాఠశాలలు మూసివేసిందని, ఇప్పటికే రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు 9వేలు ఉన్నాయని, అయితే ప్రభుత్వం ఖాళీలు లేవని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు సి హెచ్‌ హరీష్‌, ఉపాధ్యక్షులు సతీష్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు డ్రాపౌట్‌ కావడం లేదా ప్రైవేటు స్కూళ్లలో జాయిన్‌ అవ్వడం జరుగుతుందని, దాదాపు రెండేళ్లలో 6లక్షల మంది విద్యార్థులు ఇలా డ్రాపౌట్‌ అయ్యారని గుర్తుచేశారు. రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది నిరుద్యోగులు డిఎస్‌సి కోసం నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్‌సి ప్రకటించాలని , లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. అనంతరం కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మికి వినతినిచ్చారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, నిరుద్యోగ అభ్యర్థులు పాల్గొన్నారు.

➡️