ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్ : సీటుబెల్టు, హెల్మెట్ ధారణపై వంటి వాటిపై వాహన చోదకులకు మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్లు, మెడికల్ ఆఫీసర్లు, 40 మంది ఎన్ సిసి కేడెట్లుతో కలిసి శుక్రవారం స్థానిక బెలగాం కూడళ్లలో అవగాహన కల్పించారు. ట్రాఫిక్ సిగల్స్, రోడ్ ప్రమాదాలు, అధిక ప్రయాణికులతో ప్రయాణం, హెల్మెట్ ధారణ, సీట్ బెల్ట్, మద్యం సేవించి వాహనం నడపడం, ఓవర్ స్పీడ్, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం వల్ల కలిగే ప్రమాదాలను వివరించారు. ఇతర రహదారి భద్రతపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. ఎన్సిసి కేడెట్లతో వాహన డ్రైవర్లు, పాదచారులకు అవగాహన కల్పించారు. అలాగే హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహనదారులకు, సీట్బెల్ట్ ధరించి వాహనాలు వారికి గులాబీలు, చాక్లెట్ ఇచ్చి అభినందించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించని, అధికలోడుతో ప్రయాణించిన ఆటో డ్రైవర్లుకు, ప్రయాణికులకు వాటివల్ల కలిగే రోడ్ ప్రమాదాలపై అవగాహన కల్పించారు. పాదచారులు రోడ్ దాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. కార్యక్రమంలో రవాణా శాఖ, మోటార్ ఇన్స్పెక్టర్లు ఎం.శశికుమార్, జి.సీతారాం, ఎన్.రమేష్కుమార్, ఎఒ పి.నారాయణరావు, మెడికల్ ఆఫీసర్ వి.వరప్రసాదరావు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవ్, ఎన్సిసి ఆఫీసర్ పివి రావు తదితరులు పాల్గొన్నారు.
సాలూరు: రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా పట్టణ ప్రధాన రహదారి మీదుగా ఆర్టీసీ డిపో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. డిఎం భాస్కరరెడ్డి ఆధ్వర్యాన కండక్టర్లు, డ్రైవర్లు ప్లకార్డులతో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా టౌన్ సిఐ జిడి బాబు మాట్లాడుతూ రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని కోరారు. వాహనదారులు ట్రాఫిక్ నియంత్రణకు సహకరించాలని కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠినచర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు పిఎ రావు , కార్మికులు పాల్గొన్నారు.
పాలకొండ : వాహనాలు నడిపినప్పుడు జాగ్రత్తలు పాటిస్తూ భద్రతను పాటించాలని ఆర్టీసీ డిపో మేనేజర్ పి.వెంకటేశ్వరరావు అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా డిపో మేనేజర్ ఆధ్వర్యంలో డిపో నుండి స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి వరకు రోడ్డు భద్రతను సూచిస్తూ ప్లెక్సీలు, ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్.లక్ష్మణరావు, బాసురు కృష్ణమూర్తి తదితరులు ఉన్నారు.