ప్రజాశక్తి- జామి : మండలంలోని కుమరాం గ్రామ పరిదిలో కెజిబివి స్కూల్ ఎదురుగా ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. పోలీసులు అందించిన వివరాల మేరకు.. కుమరాం గ్రామానికి చెందిన దేవ సన్యాసిరావు, రాజ్యలక్ష్మి దంపతుల కుమారుడు దేవ రాకేష్(14) కుమరాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వతగరతి చదువుతున్నాడు. ఆదివారం కుమరాం గ్రామంలో తన చిన్నాన్న కుమార్తె (చెల్లెలు) శుభకార్యం నిమిత్తం అందరితో ఆనందంగా గడిపాడు. సాయంత్రం సమయంలో స్కూటీని తీసి విజయనగరం రహదారి వైపు వెళ్లాడు. కెజిబివి స్కూల్ ఎదురుగా వచ్చేసరికి ఎదురుగా కుక్క అడ్డం రావడంతో సడన్గా బ్రేక్ వేసాడు. వెంటనే బైక్ అదుపు తప్పి కిందకు పడిపోయాడు. ఈ ప్రమాదంలో రాకేష్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు అక్కడకు చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. శుభకార్యం జరిగిన రోజే ఆ కుటుంబలో ఇంతటి విషాదం జరగడంతో చూపరులు సైతం కంటతడి పెట్టించింది. ఎస్ఐ వీరబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.