ప్రజాశక్తి-కడప అర్బన్ రైతు బాగుంటేనే సమాజం సుభిక్షంగా ఉంటుందని రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం సేవలు అందిస్తోందని కలెక్టర్ వి.విజరు రామరాజు అన్నారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి మిచౌంగ్ తుఫాను పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) ఆర్ధిక సాయం మొత్తాన్ని విసి ద్వారా బటన్ నొక్కి రైతుల ఖాతాలకు నేరుగా బదిలీ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ విసి హాలు నుంచి కలెక్టర్తో పాటు రాష్ట్ర ఉద్యాన సలహా మండలి చైర్మన్ పి.శివప్రసాద్రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ ఓబుల కొండారెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖాధికారి నాగేశ్వరరావు, జిల్లా ఉద్యాన శాఖాధికారి రాజీవ్ మైఖేల్ హాజరయ్యారు. విసి ముగిసిన అనంతరం ప్రభుత్వం విడుదల చేసిన మిచాంగ్ తుఫాను పంట నష్టానికి సంబంధించి జిల్లాకు మంజూరైన ఇన్పుట్ సబ్సిడీ మొత్తా న్ని మెగా చెక్కు రూపంలో లబ్దిదారులయిన రైతులకు కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక రైతులతో కలెక్టర్ మాట్లా డుతూ ప్రకతి విఫత్తుల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారంతో పాటు.. పలు రకాలుగా రాయితీలు కూడా అందిస్తోందన్నారు. యుద్ధప్రాతిపదికన పంట నష్టాన్ని అంచనా వేసి రైతు లను ఆదుకుంటున్న ప్రభుత్వ చర్యలు అభినందనీయమన్నారు. ప్రస్తుతం 2023 డిసెంబర్ మాసంలో జిల్లాలో మిచౌంగ్ తుఫాను ప్రభావం వల్ల నష్టపోయిన 4,275 హెక్టార్ల వ్యవసాయ పంటలకు సంబంధించి 7,521 మంది రైతులకు గాను మంజూరైన ఇన్పుట్ సబ్సిడీ మొత్తం రూ.7,01,92,571లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు.169 హెక్టార్ల ఉద్యాన పంటలకు సంబంధించి 254 మంది రైతులకు మంజూరయిన ఇన్పుట్ సబ్సిడీ మొత్తం రూ.40,17,450లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ, ఉద్యాన, అనుబంధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.