ప్రజాశక్తి-మార్కాపురం రూరల్: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులకు అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మార్కాపురం ఉప కలెక్టర్ రాహుల్ మీనా అన్నారు. మంగళవారం స్థానిక మార్కాపురం వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్యాలయంలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులకు ఉపకరణాల ఉచిత పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప కలెక్టర్ రాహుల్ మీనా మాట్లాడుతూ దివ్యాంగులకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. చైర్మన్ ముంతాజ్ మాట్లాడుతూ వికలాంగులకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వికలాంగులకు అమలు చేస్తున్న పథకాలను వివరించారు. అందరూ సంఘటితమై ముఖ్యమంత్రిని ఆశీర్వదించాలని కోరారు. 2020లో కేంద్ర ప్రభుత్వ సంస్థ అలింకో వారు మార్కాపురంలో ఉపకరణాలకు 157 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారందరికీ బ్యాటరీ ట్రై సైకిళ్లు, వీల్ చైర్స్, చంక కర్రలు, చెవిటి మిషన్లను ఉచితంగా అందచేశామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు, జిల్లా మేనేజర్ జి అర్చన, మార్కాపురం వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ డాక్టర్ షంషీర్ అలీబేగ్, మున్సిపల్ చైర్ పర్సన్ బాలమురళీకృష్ణ, ఎంపిపి అరుణారెడ్డి, డివిజనల్ అభివృద్ధి అధికారి బిబిఎన్ సాయికుమార్, ఎంపీడీఓ చందన, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పి లక్ష్మీ ప్రసాద్ యాదవ్ పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/02/mrk-r-upakaranalu-pampini-chestunna-dy-collector-ph.jpg)