ట్రైనీ కలెక్టర్ శ్రీపూజ
ప్రజాశక్తి – ముసునూరు
విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించడానికి సైన్స్ ఫెయిర్ ఉపయోగపడుతుందని ట్రైనీ కలెక్టర్ శ్రీపూజ అన్నారు. బుధవారం మండలంలోని హైస్కూల్లో మండలస్థాయి సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా వచ్చిన ట్రైనీ కలెక్టర్ పూజా ప్రారంభించారు. పర్యావరణ, భూమి వెడెక్కడానికి గల కారణాలు, ఆరోగ్య భద్రత, వంటి కార్యక్రమాలపైన విద్యార్థులచే ప్రయోగాలు ప్రదర్శించారు. మండలంలోని చెక్కపల్లి హైస్కూల్కి, జీవామృతం ప్రయోగానికి మొదటి బహుమతి సాధించగా, చింతలవల్లి గురుకుల పాఠశాలకు ఆరోగ్య భద్రతపై రెండవ బహుమతి వచ్చింది. ముసునూరు హైస్కూల్ మూడవ బహుమతి పొందినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పూజ మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఉన్నత విలువలు పాటించి, దేశానికి గొప్ప సేవ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నాగేశ్వరావు, వాణి కుమారి, చిట్టిబాబు, శివ నాగమణి పాల్గొన్నారు.