వైసిపిలో సమన్వయం కుదిరేనా..?

Feb 19,2024 00:18

ప్రజాశక్తి – తుళ్లూరు : తాడికొండ నియోజకవర్గ వైసిపిలో నాయకుల మధ్య ‘సమన్వయం’ కుదిరేనా..? అనే చర్చ జోరుగా సాగుతోంది. మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే అయిన వైసిపి నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న మేకతోటి సుచరిత, మాజీ మంత్రి, వైసిపి జిల్లా అధ్యక్షునిగా ఉన్న డొక్కా మాణిక్య వరప్రసాద్‌ మధ్య సమన్వయం లేకపోవడాన్ని నాయకులు, కార్యకర్తలు ప్రస్తావిస్తున్నారు. ఇద్దరి వ్యవహారశైలి ఎడమొఖం – పెడమొఖం చందంగా ఉందని అంటున్నారు. పార్టీ అధిష్టానం పదేపదే సమన్వయకర్తలను మార్చడమే తప్ప దానివల్ల జరుగుతున్న పరిణామాల గురించి పట్టించుకోవడం లేదని కొందరు నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తొలుత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ప్రాధాన్యతను తగ్గిస్తూ నియోజకవర్గ సమన్వయకర్తగా మాణిక్య వరప్రసాద్‌ను అధిష్టానవర్గం నియమించింది. దీంతో నాయకులు, కార్యకర్తలు రెండు గ్రూపులుగా ఏర్పడి పోటా పోటీగా కార్యక్రమాలు నిర్వహించారు. తాడికొండలో ఈ రెండు గ్రూపులూ బాహాబాహీ తలపడే పరిస్ఠితి ఏర్పడింది. అయినప్పటికీ అధిష్టానం దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు. మాణిక్యవర ప్రసాద్‌ తాడికొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరపున పోటీచేసి రెండుసార్లు గెలుపొందారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో సెకండరీ విద్యాశాఖ మంత్రిగా, కిరణ్‌కుమార్‌ రెడ్డి మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. తనకు నియోజకవర్గంలో ఉన్న పట్టు, జగన్‌ సాన్నిహిత్యం తదితర కారణాల రీత్యా తాడికొండ అసెంబ్లీ సీటు తనకే దక్కుతుందనే ఆశతో మాణిక్య వరప్రసాద్‌ ఉన్నారు. తాను గెలిచి తాడికొండ సీటును జగన్‌ మోహన్‌రెడ్డికి గిఫ్ట్‌గా ఇస్తానని పదేపదే చెబుతూ వచ్చారు. అధిష్టానం మాత్రం జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌గా ఉన్న కత్తెర హెనీ క్రిస్టినా భర్త సురేష్‌కుమార్‌ను చడీచప్పుడు లేకుండా సమన్వయకర్తగా నియమించింది.శ్రీదేవి, వరప్రసాద్‌ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుండగానే అధిష్టానం సమన్వయ కర్తగా సురేష్‌ కుమార్‌ను నియమించడంతో గందరగోళం నెలకొందని కార్యకర్తలు వాపోతున్నారు. పార్టీ అధిష్టానం తనకే ఎమ్మెల్యే సీటు ఇస్తుందని, ఆ మేరకు తనకు హామీ లభించిందని సురేష్‌ కుమార్‌ ప్రచారం చేసుకున్నారు. ఎమ్మెల్యే శ్రీదేవి వ్యవహార శైలిపై అసంతృప్తి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపికి అనుకూలంగా ఓటు వేశారనే ప్రచారం నేపథ్యంలో ఆమెను వైసిపి నుంచి బహిష్కరించడం, తర్వాత ఆమె టిడిపిలో చేరిన నేపథ్యంలో కొంతమంది కార్యకర్తలు సురేష్‌ కుమార్‌ వెంట, కొంతమంది వరప్రసాద్‌ వెంట నడుస్తూ వచ్చారు. కార్యకర్తలు రెండు గ్రూపులుగా ఏర్పడిన సంగతి పార్టీ పెద్దలకు తెలిసినా సరిదిద్దే ప్రయత్నం చేయలేదని కొంతమంది నిరసన గళం వినిపిస్తూ వచ్చారు. పదేపదే సమన్వయకర్తలను మార్చడం వల్ల నాయకులు, కార్యకర్తల్లో గందరగోళం నెలకొందనే విమర్శలు చోటుచేసుకున్నాయి. అయినా అధిష్టానం పట్టించుకోక పోగా సురేష్‌కుమార్‌ను కాదని సుచరితను సమన్వయకర్తగా నియమించింది. దీంతో సురేష్‌కుమార్‌ నియోజకవర్గానికి పూర్తిగా దూరమయ్యారు. వరప్రసాద్‌ మాత్రం జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతూ అడపా దడపా నియోజకవర్గంలో జరిగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. టికెట్‌ నీకేనని సిఎం, పార్టీ పెద్దలు చెప్పారని, సర్వేల్లో సరిగ్గా లేదని నన్ను సప్రదించకుండా వారం రోజుల్లోనే సుచరితను నియమించారని ఇటీవల తాడికొండలో జరిగిన సభలో డొక్కా ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ పెద్దలను కలిసే అవకాశం కల్పించాలని కోరి నెలలు గడిచినా పార్టీ పెద్దల నుంచి పిలుపు రాలేదు. హెనీ క్రిస్టినా గతంలో తాడికొండ నియోజకవర్గం నుంచి పోటీచేశారు. సురేష్‌ కుమార్‌ సమన్వయకర్తగా కొద్దినెలల వరకు పనిచేశారు. వరప్రసాద్‌ ఎమ్మెల్యేగా, మంత్రిగా నియోజకవర్గ ప్రజలకు చిరపరిచితులే. వరప్రసాద్‌, సురేష్‌కుమార్‌ మద్దతు వైసిపి గెలుపునకు చాలా అవసరం ఉంటుందని, సమన్వయకర్తలుగా నియమించి తొలగించడంతో వారితో పాటు కార్యకర్తల్లో అసంతృప్తి ఉంటుందని గ్రహించి అధిష్టానం సరిదిద్దే ప్రయత్నం చేయాలని ఆ పార్టీ శ్రేణులు అభిప్రాయ పడుతున్నాయి. నాయకుల మధ్య సమన్వయం కుదిరేలా చర్యలు చేపట్టకుండా కార్యకర్తల మధ్య ఐక్యత ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. కార్యకర్తల్లో నెలకొన్న గందరగోళం,ఇతర అంశాలను పార్టీ పెద్దల దృష్టికి తెచ్చే పరిస్ఠితి కూడా పార్టీలో లేదని సీనియర్‌ నాయకుడొకరు చెప్పారు.’ఎన్నికలకు ఎంతో సమయం లేదు.. పార్టీలో పరిస్థితులను చక్కదిద్దకపోతే నష్టం తప్పదని ఆయనన్నారు.

➡️