ప్రజాశక్తి-విజయనగరం కోట : యువతకు అన్ని విధాలా మోసం చేసిన వైసిపి ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని విజయనగరం నియోజకవర్గ టిడిపి, జనసేన ఉమ్మడి అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. విజయనగరం నియోజకవర్గం తెలుగు యువత సమావేశం గురువారం అశోక్బంగ్లాలో జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో యువత కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. రాష్ట్రంలో గత ఐదేళ్లుగా జరిగిన విధ్వంసాన్ని అందరు చూసారన్నారు, దేశ భవిష్యత్తు అయిన యువతను అన్ని విధాలుగా మోసం చేసిన జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి లేక నిరుద్యోగం పెరిగి, నిరుత్సాహానికి గురైన యువత డ్రగ్స్ కు బానిసలవుతున్నారని విమర్శించారు. డ్రగ్స్ గ్రామాలలో కూడా విచ్చలవిడిగా దొరికే స్థితికి తీసుకువచ్చిన ఘనత జగన్ ప్రభుత్వానిదేనని, అందుకు ఉదాహరణే ఇటీవల విశాఖపట్నంలో దొరికిన 25వేల కిలోల డ్రగ్స్ అని అన్నారు. ఏటా జాబ్ కాలెండర్ విడుదల చేస్తానని చెప్పి వారిని మోసం చేశారన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే చంద్రబాబు నాయకత్వాన్ని బలపర్చి తనను గెలిపించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో టిడిపి, జనసేన కూటమి ఘన విజయం సాధిస్తుందని అదితి గజపతి అన్నారు. విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రజలు ఈ ప్రభుత్వ పాలన నుంచి విసిగిపోయి ఉన్నారన్నారు ఒకపక్క విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక మరోపక్క ఉన్న ఫ్యాక్టరీలు మూతపడి నిరుద్యోగులు ఎక్కువగా తయారయ్యారని తెలిపారు. టిడిపి ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాల పట్ల ప్రజలు ఆకర్షితులవు తున్నారని తెలిపారు. టిడిపి ఆవిర్భావ వేడుకలు జయప్రదం చేయండి అశోక్ బంగ్లాలో శుక్రవారం జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు కోరారు. ఉదయం 9 గంటలకు అశోక్ బంగ్లాలో పార్టీ జెండాను పొలిట్ బ్యూరోసభ్యులు పూసపాటి అశోక్ గజపతి రాజు ఎగుర వేస్తారన్నారు. నాయకులు పిల్ల విజయ కుమార్ పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మి వరప్రసాద్, బంగారు బాబు గంటా పోలినాయుడు, కనకల మురళీమోహన్, విజ్జపు ప్రసాద్, కంది మురళి నాయుడు పాల్గొన్నారు.