ప్రజాశక్తి-బొబ్బిలి : రైల్వే స్టేషన్లో వ్యాగన్ లోడింగ్, అన్ లోడింగ్ కేంద్రాన్ని వేరే ప్రాంతానికి తరలిస్తే రైలు పట్టాలపై బైఠాయించి ఆందోళన చేస్తామని పట్టణ కళాసీ సంఘం కార్యదర్శి డి.వర్మ అన్నారు. వ్యాగన్ కేంద్రాన్ని కొనసాగించాలని శుక్రవారం రైల్వే స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాగన్ కేంద్రంలో 500 మంది కళాసీలు పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. వ్యాగన్ కేంద్రాన్ని ఇతర ప్రాంతానికి తరలిస్తే వారంతా ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాగన్ కేంద్రాన్ని కొనసాగించాలని భువనేశ్వర్లో రైల్వే జనరల్ మేనేజర్కు వినతిపత్రం అందజేశామని చెప్పారు. వ్యాగన్ కేంద్రాన్ని బొబ్బిలిలో కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేదంటే పోరాటం ఉధృతం చేస్తామన్నారు. కళాసీల పోరాటానికి సిఐటియు జిల్లా నాయకులు ఎస్.గోపాలం మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో కళాసీ సంఘం నాయకులు, కళాసీలు పాల్గొన్నారు.