ప్రజాశక్తి – కిర్లంపూడి
సాగు చేసిన పంటలకు నీరు అందించలని డిమాండ్ చేస్తూ రైతులు కిర్లంపూడి నీటి పారుదల శాఖ సెక్షన్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. పిఠాపురం రూరల్ మండలంలోని గోకివాడ, జగపతిరాజపురం రైతులు సాగు చేసిన 200 ఎకరాలపైగా ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని పలు దఫాలుగా నీటి పారుదల శాఖ అధికారులకు మొరపెట్టుకున్నారు. అయినా ఫలితం లేకపోవడంతో సోమవారం కిర్లంపూడి సెక్షన్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఏలేరు నుంచి వచ్చే నీటిని దిగువకు విడుదల చేయాలని ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టు కున్నా నీరు తక్కువగా ఉందని కుంటి సాకులు చెబుతూ అధికారులు తప్పించుకుంటున్నారని ఈ సందర్భంగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీరు విడుదల చేయకపోవడంతో భూములు బంజరు భూములుగానే మిగిలిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే నారు వేసి 35 రోజులు అయ్యిందని, నీరు లేక మడులు ఎండిపోతున్నాయని తెలిపారు. ఇప్పటికైన నీటి పారుదల శాఖ అధికారులు స్పందించి తక్షణమే నీరు విడుదల చేసి రబీ సాగును కాపాడాలని రైతు మడికి బాబ్జీ కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు మాసా మోషే, ఏసుబాబు, పెద్దకాపు, రామకృష్ణ తదితర రైతులు పాల్గొన్నారు.